
- 3 రోజుల్లో 30 గంటల పాటు విచారించిన ఆఫీసర్లు
- ఢిల్లీలోని ఈడీ ఆఫీసును ముట్టడించిన కాంగ్రెస్ కేడర్
- కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన.. పలువురు నేతల అరెస్ట్
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్మాజీ చీఫ్ రాహుల్గాంధీ వరుసగా మూడోరోజు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారుల ముందు హాజరయ్యారు. మూడో రోజూ ఆయనను సుదీర్ఘంగా 9 గంటల పాటు ప్రశ్నించారు. ఉదయం11.35 గంటలకు జెడ్ ప్లస్ కేటగిరీ సీఆర్పీఎఫ్ సెక్యూరిటీతో రాహుల్ఢిల్లీలోని ఏపీజే అబ్దుల్ కలామ్ రోడ్డులో ఉన్న ఈడీ హెడ్ఆఫీసుకు చేరుకున్నారు. ఆయన వెంట చెల్లెలు ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఉన్నారు.
మళ్లీ సమన్లు
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో సోమవారం నుంచి వరుసగా 3 రోజుల పాటు రాహుల్ ఈడీ విచారణకు హాజరు కాగా.. దాదాపు 30 గంటల పాటు అధికారులు ఆయనను ప్రశ్నించారు. సోమవారం 10 గంటలపాటు, మంగళవారం 11 గంటలపాటు విచారణ సాగింది. మధ్యలో రాహుల్ తన తల్లి సోనియాగాంధీని హాస్పిటల్లో పరామర్శించేందుకు వెళ్లి వచ్చారు. బుధవారం కూడా సుదీర్ఘంగా 9 గంటల పాటు విచారణ జరిగింది. యంగ్ ఇండియా కంపెనీకి సంబంధించే 16 ప్రశ్నలను రాహుల్పై ఈడీ సంధించినట్లు తెలిసింది. శుక్రవారం మళ్లీ విచారణకు రావాలంటూ రాహుల్కు ఈడీ అధికారులు బుధవారం సమన్లు జారీ చేశారు.
నిరసనలు.. అరెస్టులు
ఢిల్లీలోని ఈడీ ఆఫీసు ముందుకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలిరావడంతో పోలీసులు అక్కడ 144 సెక్షన్ విధించారు. కాంగ్రెస్ నేతలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేయగా, పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఏఐసీసీ ఆఫీసు ముందు కూడా నిరసన ప్రదర్శన చేపట్టారు. కేంద్రం రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగుతోందని చత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బాఘెల్ మండిపడ్డారు. ఏఐసీసీ ఆఫీసులోకి పార్టీ లీడర్లను పోలీసులు అనుమతించకపోవడంతో.. తమ ఆఫీసులోకి ఢిల్లీ పోలీసులు దౌర్జన్యంగా చొరబడ్డారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. రాహుల్కు మద్దతుగా తాము తమ ఆఫీసులో ఆందోళనకు దిగితే అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. నిరసనలో పాల్గొన్న కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులపై కేసు పెట్టాలని కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా డిమాండ్ చేశారు. గురువారం దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని పార్టీ కేడర్కు ఆయన పిలుపునిచ్చారు.