
జోడో యాత్ర టార్గెట్గా బాంబు దాడి చేస్తం
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బెదిరింపులు
ఇండోర్లోని ఓ స్వీట్ షాపు వద్ద లేఖ వదిలిన దుండగులు
ఇండోర్ : భారత్ జోడో యాత్రలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని చంపేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు వచ్చాయి. రాహుల్ యాత్ర మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చేరుకోగానే నగరం బాంబు దాడులతో దద్దరిల్లిపోతుందని పేర్కొంటూ ఓ స్వీట్ షాపు వద్ద గుర్తుతెలియని వ్యక్తులు లేఖ వదిలివెళ్లారు. ఆ లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చుట్టుపక్కల సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఓ వ్యక్తిని అరెస్ట్ చేశామని చెప్పారు. ఇది ఆకతాయిల పని కావొచ్చని, అయినప్పటికీ సెక్యూరిటీ పరంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని ఇండోర్ పోలీస్ కమిషనర్ మిశ్రా శుక్రవారం వెల్లడించారు. రాహుల్ జోడో యాత్ర ఈ నెల 20న మధ్యప్రదేశ్లోకి ప్రవేశించి ఈ నెల 28న ఇండోర్కు చేరుకోనుంది.
రాహుల్ చెప్పింది నిజమే : తుషార్ గాంధీ
రాహుల్ యాత్ర అకోలా జిల్లా బాలాపూర్ నుంచి శుక్రవారం ఉదయం కొనసాగింది. బుల్దానా జిల్లాకు చేరుకోగానే మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ యాత్రలో జాయిన్ అయ్యారు. రాహుల్తో కలిసి నడిచారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వీడీ సావర్కర్పై రాహుల్ చెప్పింది నిజమేనని అన్నారు. సావర్కర్ బ్రిటిషర్లకు తొత్తులా వ్యవహరించారని, అందుకు ఆధారాలున్నాయని అన్నారు.
రాహుల్పై పరువునష్టం కేసు
రాహుల్గాంధీపై మహారాష్ట్రలోని థానే పోలీస్ స్టేషన్లో పరువు నష్టం కేసు నమోదైంది. సావర్కర్ ను కించపర్చేలా మాట్లాడారంటూ ఏక్నాథ్ షిండే వర్గం శివసేన నేత వందనా డోంగ్రే చేసిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. సెక్షన్ 500, 501 కింద కేసు నమోదు చేశామన్నారు. మరోవైపు, రాహుల్ కామెంట్లకు నిరసనగా సావర్కర్ జన్మస్థలమైన నాసిక్లోని భాగూర్ వాసులు శుక్రవారం బంద్ పాటించారు.