అమాయకుల చావుకు కారణమైన వాళ్లను వదిలేసి నన్ను అరెస్ట్ చేస్తారా?

అమాయకుల చావుకు కారణమైన వాళ్లను వదిలేసి నన్ను అరెస్ట్ చేస్తారా?

హైదరాబాద్: అమాయకుల చావుకు కారణమైన మంత్రి పువ్వాడ అజయ్, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు కుమారున్ని వదిలేసి తనను అరెస్ట్ చేయడమేంటని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి ప్రశ్నించారు. గురువారం కాంగ్రెస్ చేపట్టిన రాజ్ భవన్ ముట్టడిలో పాల్గొన్న రేణుకా చౌదరి... తనను అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఓ ఎస్సై కాలర్ పట్టుకుంది. ఈ క్రమంలో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎస్సై కాలర్ పట్టుకున్నందుకు గోల్కొండ పీఎస్ లో ఆమెపై కేసు నమోదు అయ్యింది. ఈ నేపథ్యంలో రేణుకా చౌదరి మాట్లాడుతూ... తనను వెనక నుంచి నెట్టడంతో ఎస్సై కాలర్ పట్టుకున్నానని, ఆ ఎస్సైకి క్షమాపణలు చెప్పడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. అయినా మహిళల చుట్టూ ఇంతమంది మగ పోలీసులు ఉండటమేంటని  ప్రశ్నించారు. తన పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులే తనకు క్షమాపణ చెప్పాలని రేణుకా చౌదరి డిమాండ్ చేశారు.