‘దొరగారి సర్కారు పూర్తిగా చేతులెత్తేసినట్లు తేలిపోయింది’

‘దొరగారి సర్కారు పూర్తిగా చేతులెత్తేసినట్లు తేలిపోయింది’

గత కొద్ది రోజులుగా హైదరాబాదులో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కరోనా బాధితులను కాపాడటంలో తెలంగాణ సర్కారు పూర్తిగా విఫలమైనట్లు స్పష్టమవుతోంద‌ని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి అన్నారు. రాష్ట్రంలో ప్రధానమైన గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆస్పత్రుల్లోని పరిణామాలే ఇందుకు సాక్ష్యమ‌న్నారు. గాంధీ ఆస్పత్రిలో కరోనాతో మరణించిన ఒక వ్యక్తి మృతదేహాన్ని దాదాపు రోజంతా మిగిలిన రోగుల మధ్యే ఉంచి వాళ్ళను భయభ్రాంతుల్ని చేశారన్నారు.

ఆక్సిజన్ లేక మరో కరోనా బాధితుడి ప్రాణం పోయిందని, ఇక ఉస్మానియా ఆస్పత్రి మురికినీళ్ళ పాలై నరకాన్ని తలపించిందన్నారు. నిమ్స్‌లోనూ ఏమంత ఆశాజనక పరిస్థితులు లేవని అన్నారు. మరోవైపు ఔట్‌సోర్సింగ్ నర్సులు, వార్డ్ బాయ్స్, 4వ తరగతి సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది సమ్మె చేసే పరిస్థితిని కల్పించారని విమ‌ర్శించారు. ఈ సమ్మెను ఆపించడానికి ప్రభుత్వం రోజుల తరబడి సమయం తీసుకుందని ఆమె తెలిపారు.

“ఇదంతా చూస్తుంటే కరోనాను కట్టడి చెయ్యడంలో కేసీఆర్ దొరగారి సర్కారు గాడితప్పి పూర్తిగా చేతులెత్తేసినట్లు తేలిపోయింది. తెలంగాణ ప్రజలకు దేవుడే దిక్కు అన్నట్టుగా ప్రభుత్వ యంత్రాంగం మత్తు నిద్రపోతోంది” అని విజ‌య‌శాంతి అన్నారు.