కాశీబుగ్గ/ మహబూబాబాద్అర్బన్/ జయశంకర్ భూపాలపల్లి/ ములుగు, వెలుగు: కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలపై అక్రమ కేసులు, ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. ఈడీ ద్వారా అక్రమ కేసులతో కేంద్ర బీజేపీ సర్కారు కక్ష సాధింపు రాజకీయాలు చేస్తోందని మండిపడుతూ బీజేపీ జిల్లా పార్టీ ఆఫీస్లను ముట్టడించారు. వరంగల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ ఆయూబ్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొన్నది. నిరసన తెలుపుతున్న డీసీసీ అధ్యక్షుడితోపాటు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు.
హనుమకొండ కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ జంక్షన్లో ధర్నా నిర్వహించారు. మహబూబాబాద్జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మురళీనాయక్ పాల్గొని బీజేపీ చేస్తున్న దౌర్జన్యాలపై మండిపడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీజేపీ ఆఫీస్ ముట్టడి కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్, టీపీసీసీ అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, టీపీసీసీ మెంబర్ చల్లూరి మధు, నాయకులతో కలిసి నిరసన తెలిపారు.
ములుగులోని హైవే పై కాంగ్రెస్మండలాధ్యక్షుడు ఎండీ.చాంద్ పాషా ఆధ్వర్యంలో నిరసన చేపట్టగా పంచాయతీరాజ్శాఖ డైరెక్టర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బైరెడ్డి భగవాన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేస్తూ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, ఇలాంటి బెదిరింపులకు పార్టీ నేతలు భయపడరని, రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.
