ఎంఎస్పీని మేనిఫెస్టోలో పెడతం: రాహుల్ గాంధీ

ఎంఎస్పీని మేనిఫెస్టోలో పెడతం: రాహుల్ గాంధీ
  •     మధ్యప్రదేశ్​కు చేరిన న్యాయ్ యాత్ర
  •     భారీగా తరలివచ్చిన కార్యకర్తలు

భోపాల్/ జైపూర్: దేశంలోని రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)తో పాటు ఎంఎస్పీకి చట్టబద్దత కల్పించే అంశాన్ని తమ పార్టీ మేనిఫెస్టోలో చేరుస్తామని కాంగ్రెస్ మాజీ చీఫ్​ రాహుల్​ గాంధీ పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ హామీని నిలబెట్టుకుంటామని చెప్పారు. ఈమేరకు శనివారం భారత్​ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్ ఈ హామీ ఇచ్చారు. మోదీ సర్కారు కేవలం కొద్దిమంది ఇండస్ట్రియలిస్టుల కోసమే ఆలోచిస్తోందని, రైతులను పట్టించుకోవడంలేదని విమర్శించారు. ఐదు రోజుల పాటు నిలిచిన న్యాయ్ యాత్ర శనివారం రాజస్థాన్ లో ప్రారంభమైంది. గ్వాలియర్ లో రాహుల్​ గాంధీ మాట్లాడుతూ.. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే చేసే మొట్టమొదటి పని కులగణన చేపట్టడమేనని చెప్పారు.

ఐదు రోజుల విరామం..

న్యాయ్ యాత్ర ఐదు రోజుల విరామం తర్వాత శనివారం మధ్యాహ్నం తిరిగి ప్రారంభమైంది. రాజస్థాన్​లోని ధోల్ పూర్ జిల్లాలో..​ ఆ రాష్ట్ర మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, ఏఐసీసీ ఇన్‌‌చార్జ్ సుఖ్‌‌జిందర్ రంధావా, ఇతర నాయకులతో కలిసి రాహుల్ యాత్రను మొదలు పెట్టారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శనివారం రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్‌‌లోకి యాత్ర ప్రవేశిస్తుంది. ఈ నెల 6 వరకు మధ్యప్రదేశ్‌‌ రాష్ట్రంలోనే రాహుల్​ యాత్ర కొనసాగుతుంది. 5న ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయంలో రాహుల్ పూజలు చేయనున్నారు. 7న గుజరాత్​లోకి రాహుల్​ఎంటర్​ అవుతారు. ఆ తర్వాత 10న గుజరాత్ నుంచి మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుంది. కాగా, మహారాష్ట్ర రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలాసాహెబ్ థోరట్ శనివారం థానే సిటీ, భివాండిని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.