
హైదరాబాద్, వెలుగు: కేటీఆర్ అసలు ఉద్యమకారుడే కాదని.. కానీ, ఓ భగత్ సింగ్, ఓ అల్లూరి సీతారామరాజులా ఫీల్ అవుతున్నాడని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేటీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకే ఏసీబీ విచారణ సాగుతోందని పేర్కొన్నారు. సోమవారం గాంధీ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఫార్ములా ఈ రేస్ కేసులో అరెస్టయి, జైలుకు వెళ్లాలని కేటీఆర్ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని ఫైర్ అయ్యారు.
జైలుకు వెళ్తేనే సీఎం అవుతాననే సెంటిమెంట్ ను కేటీఆర్ బలంగా నమ్ముతున్నాడని చెప్పారు. తన సోదరి జైలుకు వెళ్లింది ఢిల్లీలో.. కానీ, తాను జైలుకు వెళ్లేది హైదరాబాద్ లోనని, అందుకే సీఎం అయ్యే అవకాశం తనకే ఎక్కువగా ఉంటుందని కేటీఆర్ ఇటీవల తన సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నారని చామల ఆరోపించారు.
జైలుకు వెళ్లడం తనకు కొత్త కాదని కేటీఆర్ అంటున్నారని, అసలు ఆయన జైలుకు వెళ్లింది ఎప్పుడో చెప్పాలని ప్రశ్నించారు. గత జన్మలో ఆయన గాంధీతో కలిసి దక్షిణాఫ్రికాలో జైలుకు వెళ్లి ఉంటాడేమోనని ఎద్దేవా చేశారు. కుట్రలు, కుతంత్రాలకు కేసీఆర్ నిలయమని ధ్వజమెత్తారు. ఫార్ములా ఈ కార్ రేస్ లో కీలకమైన వ్యక్తి సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ అని.. కానీ, ఆయన ఇప్పుడు కనబడడం లేదన్నారు.
ఎక్కడున్నాడో కూడా ఎవరికీ తెలియదన్నారు. ఆయన లేడు కాబట్టి తనకేం కాదనే ధీమాలో కేటీఆర్ ఉన్నాడని ఆరోపించారు. వీళ్ల అవసరాల కోసం, తమ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి కేటీఆర్ ఏమైనా చేస్తాడని, గతంలో కేటీఆర్ మిత్రుడు కేదార్ విదేశాల్లో చనిపోయారని చామల వ్యాఖ్యానించారు.