
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ వాటా యూరియాను వెంటనే రిలీజ్ చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాను కాంగ్రెస్ ఎంపీలు కోరారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి నడ్డాను కలిసి, వినతి పత్రం సమర్పించారు. ఎంపీలు మల్లు రవి, రేణుకా చౌదరి, గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్ కుమార్రెడ్డి, అనిల్ కుమార్ తదితరులు నడ్డాను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులను కేంద్ర మంత్రికి వివరించారు.
గత రెండు నెలలుగా రాష్ట్రం నుంచి విజ్ఞప్తులు చేస్తున్నా.. యూరియా సరఫరా కాలేదన్నారు. ఇప్పటికే రైతులు పంటలు వేశారని, యూరియా కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్ కోసం కేంద్రం మొత్తం రాష్ట్రానికి 8.30 లక్షల టన్నుల యూరియా కేటాయించగా.. ఏప్రిల్ నుంచి ఇప్పటివరకూ 5.32 లక్షల టన్నులు మాత్రమే సరఫరా చేసిందన్నారు. మిగిలిన 2.98 లక్షల టన్నుల యూరియాను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఒకవేళ అంతమొత్తంలో అందుబాటులో లేకపోతే... వీలైనంత ఎక్కువగా యూరియాను పంపాలని కోరారు. తమ విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని ఎంపీ మల్లు రవి వెల్లడించారు. ఇదే అంశంపై మంగళవారం మరోసారి కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసి, తెలంగాణ వాటా యూరియా విడుదల ప్రక్రియను వేగవంతం చేసేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు.
తెలంగాణకు ఖరీఫ్లో యూరియా కేటాయింపు, విడుదల
నెల నెలవారీ కేటాయింపు విడుదల వ్యత్యాసం
(లక్షల టన్నులు) (లక్షల టన్నులు) (లక్షల టన్నులు)
ఏప్రిల్ 1.70 1.21 0.49
మే 1.60 0.88 0.72
జూన్ 1.70 0.98 0.72
జులై 1.60 1.43 0.17
ఆగస్టు 1.70 0.82 0.88
మొత్తం 8.30 5.32 2.98