
హైదరాబాద్, వెలుగు: ఇండియా కూటమి అభ్యర్థిగా ఉప రాష్ట్రపతి ఎన్నికలో పోటీచేస్తున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆయనకు కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, సురేశ్ షెట్కార్, అనిల్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ ఘన స్వాగతం పలికారు.
సోమవారం ఉదయం 11. 30 గంటలకు బంజారాహిల్స్ లోని హోటల్ తాజ్ కృష్ణలో కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జస్టిస్ సుదర్శన్ రెడ్డి సమావేశం కానున్నారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొననున్నారు. ఈ సమావేశానికి సీపీఐ, సీపీఎం నేతలను కూడా ఆహ్వానించారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా తనను గెలిపించాలని ఈ సదర్భంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులను కోరనున్నారు.