జులై 4న కాంగ్రెస్ బహిరంగ సభ

జులై 4న కాంగ్రెస్ బహిరంగ సభ
  • ఎల్బీ స్టేడియం వేదికగా స్థానిక ఎన్నికల శంఖారావం
  • చీఫ్ గెస్ట్​గా హాజరుకానున్న మల్లికార్జున ఖర్గే
  • కేడర్​కు దిశానిర్దేశం చేయనున్న పార్టీ చీఫ్

హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నది. వచ్చే నెల 4న సాయంత్రం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నది. ఈ సభకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చీఫ్ గెస్ట్​గా హాజరవుతున్నారు. రాష్ట్రంలోని గ్రామ కమిటీ కాంగ్రెస్ అధ్యక్షుల నుంచి మొదలుకుని పీసీసీ లీడర్ల వరకు, పార్టీలోని అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు ఈ సభకు హాజరుకావాలని ఇప్పటికే పీసీసీ నుంచి ఆదేశాలు వెళ్లాయి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం పార్టీ కేడర్​కు ఈ సభ ద్వారా ఖర్గే దిశానిర్దేశం చేయనున్నారు.

 వాస్తవానికి జులై 4న ఉదయం గాంధీభవన్ లో పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) మీటింగ్ కు మాత్రమే ఖర్గే హాజరుకానున్నారని మొదట పీసీసీ ప్రకటించింది. అయితే, ఎస్సీ వర్గీకరణ సభ పెడితే బాగుంటుందనే ఆలోచనలో ఉన్న పీసీసీ, ఇదే సమయంలో 3 నెలల్లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఎన్నికల శంఖారావ సభ నిర్వహించేందుకు పీసీసీ నేతలు మొగ్గు చూపారు. 

పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలను ఈ సభకు తరలించి 18 నెలల పాలనలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇప్పటి నుంచే జనంలోకి తీసుకెళ్లేందుకు కేడర్​కు ఖర్గే తగిన సూచనలు చేయనున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన, సన్న బియ్యం, మహిళలకు ఫ్రీ బస్సు, రైతు భరోసా వంటి పథకాల అమలుపై ఈ సభలో ప్రత్యేకంగా ఖర్గే ప్రస్తావించనున్నారు. ఈ సభ సక్సెస్ కోసం ఇప్పటి నుంచే కాంగ్రెస్ కసరత్తు చేస్తున్నది.