- పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
- బీజేపీ, బీఆర్ఎస్ నాయకులకు బీసీని సీఎం చేసే దమ్ముందా అని సవాల్
- బీసీ సెల్ చైర్మన్గా ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్ బాధ్యతల స్వీకరణ
హైదరాబాద్, వెలుగు: రానున్న రోజుల్లో కాంగ్రెస్ నుంచి బీసీ వ్యక్తి సీఎం కావడం ఖాయమని పీసీసీ చీఫ్మహేశ్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం గాంధీ భవన్లో కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్గా ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పీసీసీ చీఫ్ హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వంద సీట్లతో తిరిగి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఒకవేళ2029లో డీ లిమిటేషన్ ఆధారంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ కు 140కి పైగా సీట్లు పక్కా వస్తాయన్నారు. తెలంగాణలో బీసీ నేతలంతా ఐక్యంగా కలిసి పనిచేయడం వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. దేశంలోని ఎన్నో రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు, గవర్నర్లను అందించిన ఘనత కాంగ్రెస్ దేనని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో 60 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు డీసీసీ చీఫ్ పదవులు ఇచ్చామని, 67 శాతం సర్పంచులుగా బీసీలను గెలిపించుకున్నామని, 65 శాతం బీసీలకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చామని తెలిపారు. తాము కూడా బీసీ వ్యక్తులను సీఎంను చేస్తామని చెప్పే దమ్ము బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉందా..? అని సవాల్విసిరారు. బీసీ రిజర్వేషన్ బిల్లు గవర్నర్ వద్ద ఎందుకు పెండింగ్ లో ఉందో బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకాటి శ్రీహరి, విప్ లు ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రం నుంచి 40 నుంచి 50 సీట్లు మహిళలకే
డీ లిమిటేషన్ జరిగితే తెలంగాణలో 40 నుంచి 50 వరకు మహిళలకు అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశం ఉందని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ నియమితులైన తర్వాత మొదటిసారి గాంధీ భవన్ లో ఆమె అధ్యక్షతన మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పటిష్టత కోసం మహిళలు కష్టపడి పనిచేస్తే రానున్న రోజుల్లో వారే అసెంబ్లీలో ఉంటారని తెలిపారు. కాంగ్రెస్ బలోపేతం కోసం పనిచేసే మహిళలకు పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు.
