
నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం ఈడీ ఎదుట హాజరుకానున్నారు. కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆయనను ప్రశ్నించనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున నిరసనలకు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న 25 ఈడీ కార్యాలయాల ఎదుట ఆందోళన నిర్వహించాలని కాంగ్రెస్ సీనియర్ నేత మాణికం ఠాగూర్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తోందని ఆయన ఆరోపించారు. రేపు రాహుల్ గాంధీ వెంట పలువురు సీనియర్ లీడర్లు ఢిల్లీలోని ఈడీ ఆఫీస్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహిస్తారని చెప్పారు.
కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీతో పాటు పార్టీ నేత రాహుల్ గాంధీపై కేంద్రం కుట్ర పన్నుతోందని ఇందులో భాగంగానే ఫేక్ కేసులు బనాయిస్తోందని మాణికం ఠాగూర్ ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోడీ, హోం మంత్రి అమిత్ షా విపక్షాల గొంతు నొక్కేందుకు ఈడీ, సీబీఐలను ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. ప్రతీకార రాజకీయాల్లో భాగంగానే సోనియా, రాహుల్ గాంధీలకు సమన్లు పంపారని విమర్శించారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల నేతలను టార్గెట్ చేస్తున్నారని, ఈ నిరంకుశ వైఖరిని కాంగ్రెస్ ఏ మాత్రం సహించదని ఠాగూర్ స్పష్టం చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సోనియా గాంధీకి సైతం సమన్లు జారీ చేసింది.