
హైదరాబాద్, వెలుగు : సీడబ్ల్యూసీ మీటింగ్ కోసం కాంగ్రెస్ అగ్రనాయకులంతా హైదరాబాద్ రానున్నారు. అతిథులకు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా126 రకాల తెలంగాణ ఫుడ్ వెరైటీలను వడ్డించనున్నట్టు తెలిసింది. టిఫిన్ నుంచి లంచ్ వరకు మొత్తం తెలంగాణ స్టైల్ ఫుడ్తో వారికి విందును ఏర్పాటు చేస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి మన ఫుడ్స్పెషల్స్ను తయారు చేయించేందుకు వంట మనుషులను తీసుకొస్తున్నట్టు చెప్పారు. వారితో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన షెఫ్లు కూడా వంటకాలను తయారు చేయనున్నారు. పొద్దున ఇడ్లీ, వడ, దోశ, ఫ్రూట్ సలాడ్ ఉప్మా, కిచిడీ, కుర్మా, రాగి సంకటి, మిల్లెట్ వడలను టిఫిన్గా వడ్డించనున్నారు.
మధ్యాహ్నం లంచ్కు హైదరాబాదీ స్పెషల్ చికెన్ ధమ్ బిర్యానీ, బగార అన్నం, బోటి కూర, తలకాయ కూర, పాయ, మటన్, మేక లివర్ ఫ్రై, తెలంగాణ స్పెషల్ మటన్ కర్రీ, చింతచిగురు మటన్, గోంగూర మటన్, దోసకాయ మటన్, అంకాపూర్ చికెన్, చేపలు, హలీం వంటి వాటిని నాన్ వెజ్ మెనూ పెడ్తున్నట్టు తెలిసింది. వెజ్లో పచ్చిపులుసు, గోంగూర చట్నీ, గుత్తి వంకాయ, కొబ్బరి చట్నీ, అంబలి, దాల్చా, రోటి పచ్చళ్లు .. ఇక స్నాక్స్ ఐటెమ్స్లో సర్వపిండి, కుడుములు, మురుకులు, మక్క గుడాలు, మొక్క జొన్న గారెలు, సకినాలు, గారెలను అతిథులకు రుచి చూపించనున్నారు. వాటితో పాటు తెలంగాణ, హైదరాబాద్ స్పెషల్ 12 రకాల స్వీట్లను అతిథులకు వడ్డిస్తారట. ఇక, సాయంత్రం ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్లను అందిస్తారని చెప్తున్నారు. తెలంగాణ వంటలతో పాటు దక్కన్ వంటలను మెనూలో పెడ్తారని ఆ పార్టీ నేతలు తెలిపారు.