జహీరాబాద్​ పై ..కాంగ్రెస్​ ఫోకస్​

జహీరాబాద్​ పై ..కాంగ్రెస్​ ఫోకస్​
  •     కంచుకోటలో పాగా వేసేందుకు ప్రణాళిక
  •     మిగతా పార్టీల కంటే ముందే అభ్యర్థి డిక్లేర్
  •     ఇతర పార్టీల నుంచి చేరికలపై నజర్​
  •     హైదారాబాద్​లో హస్తం నేతల స్పెషల్​ మీటింగ్​

​కామారెడ్డి, వెలుగు :  జహీరాబాద్​ ఎంపీ సెగ్మెంట్​పై కాంగ్రెస్​ స్పెషల్​ ఫోకస్​ పెట్టింది. గత పార్లమెంట్​ ఎన్నికల్లో తక్కువ మెజార్టీతో చేజారిన స్థానాన్ని ఈ సారి ఎలాగైనా హస్తగతం చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. మూడు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను డిక్లేర్ ​చేయగా, అందరికంటే ముందే తొలి జాబితాలోనే కాంగ్రెస్​ అభ్యర్థిని ప్రకటించింది. మాజీ ఎంపీ సురేశ్​ శెట్కార్​ హస్తం పార్టీ నుంచి పోటీ చేయనుండగా, బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్, బీఆర్​ఎస్​ నుంచి గాలి అనిల్ కుమార్​ బరిలో నిలువనున్నారు. హైదరాబాద్​లో సోమవారం మంత్రి దామోదర్​ రాజనర్సింహ

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, అభ్యర్థి సురేశ్​ శెట్కర్, ఎల్లారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేలు మదన్​మోహన్​రావు, లక్ష్మీకాంత్​రావు, బాన్సువాడ నియోజకవర్గ ఇన్​చార్జి ఏనుగు రవీందర్​రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జహీరాబాద్​ సెగ్మెంట్​లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీలో చేరికలపై చర్చించారు.

పెరిగిన బలం

జహీరాబాద్​ పార్లమెంట్​ సెగ్మెంట్​లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గాలన్నింటీలో బీఆర్​ఎస్​ అభ్యర్థులే విజయం సాధించగా, తాజా ఎన్నికల్లో నాలుగు చోట్ల కాంగ్రెస్, రెండు చోట్ల బీఆర్ఎస్​, ఒక చోట బీజేపీ గెలిచాయి. దీంతో కాంగ్రెస్​ బలం పుంజుకుంది. ఈ  ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్​కు 5,49,143 ఓట్లు వచ్చాయి. ఇవి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీకి వచ్చిన ఓట్ల కంటే 1,21,128 అధికం. 2019 పార్లమెంట్​ ఎన్నికల్లో కాంగ్రెస్​ స్వల్ప తేడాతో జహీరాబాద్​ స్థానాన్ని చేజార్చుకుంది.

ఈ పార్టీ నుంచి పోటీ చేసిన మదన్​మోహన్​రావుకు 4,28,015 ఓట్లు రాగా, కేవలం 6,229 ఓట్ల తేడాతోనే అప్పటి బీఆర్​ఎస్​ అభ్యర్థి బీబీ పాటిల్​ విజయం సాధించారు.  గతంలో జహీరాబాద్​ కాంగ్రెస్​కు కంచుకోటగా ఉంది. దీంతో పార్లమెంట్​ ఎన్నికల్లో విజయం సాధించి తిరిగి తమ స్థానాన్ని నిలబెట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లే సాధించాలనే టార్గెట్​తో పనిచేస్తున్నారు. స్టేట్​లో తమ పార్టీ అధికారంలో ఉండడంతో కార్యకర్తలు సైతం రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారు.

చేరికలపై ఫోకస్​..

ఎంపీ ఎన్నికల దృష్ట్యా ఆయా పార్టీలకు చెందిన లీడర్లను కాంగ్రెస్​ చేర్చుకునేందుకు ఆ​పార్టీ లీడర్లు ఆసక్తి చూపుతున్నారు. కామారెడ్డిలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ, ఎల్లారెడ్డిలో  ఎమ్మెల్యే మదన్​, జుక్కల్​ లో ఎమ్మెల్యే లక్ష్మీకాంత్​రావు, బాన్సువాడలో నియోజకవర్గ ఇన్​చార్జి ఏనుగు రవీందర్​రెడ్డి ఆధ్వర్యంలో ముమ్మరంగా చేరికలు జరుగుతున్నాయి.

ఆయా మండలాల్లోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు దాదాపు పార్టీలు మారారు. దీంతో బీఆర్​ఎస్​ ఖాళీ అయ్యింది. నామినేటెట్​పదవులపై ఆశలు పెట్టుకున్న స్థానిక లీడర్లు ఎంపీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం క్షేత్రస్థాయిలో తిరుగుతూ ముమ్మర ప్రచారం చేస్తున్నారు.