ఆ మూడింటిపై తీవ్ర ఉత్కంఠ..కీలకంగా మారిన పొంగులేటి, ​భట్టి, రేణుక

ఆ మూడింటిపై తీవ్ర ఉత్కంఠ..కీలకంగా మారిన పొంగులేటి, ​భట్టి, రేణుక
  •     ఇల్లెందు, అశ్వారావుపేట టికెట్లు తమ వాళ్లకే ఇవ్వాలంటూ పట్టు 
  •      కొత్తగూడెం తమకే ఫైనల్ అయిందంటున్న సీపీఐ

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలోని ఇల్లెందు, అశ్వారావుపేట, కొత్తగూడెం నియోజకవర్గాలకు చెందిన  కాంగ్రెస్​ ఆశావాహుల్లో టికెట్​ టెన్షన్​ కొనసాగుతోంది. ఇల్లెందు, అశ్వారావుపేటలో తమ వారికే  టికెట్లు ఇప్పించుకునేందుకు టీపీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్​ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, సీఎల్పీ లీడర్​ భట్టి విక్రమార్క, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఫస్ట్​ లిస్ట్​లో పేర్లు లేకపోవడంతో ఆశావాహులు  డీలా పడ్డారు. సెకండ్​ లిస్ట్​ లోనూ హైకమాండ్​ ఇల్లెందు, అశ్వారావుపేట నియోజకవర్గాలకు క్యాండిడేట్లను ప్రకటించలేదు.

ఓ వైపు నామినేషన్ల దాఖలుకు టైం దగ్గరపడ్తుండడంతో ఆశావాహులు అయోమయానికి గురవుతున్నారు. మరోవైపు జిల్లాలో ఏకైక జనరల్​ సీటైన కొత్తగూడెంపై పీటముడి కొనసాగుతోంది. కొత్తగూడెం సీటు తమకే ఫైనల్​అయిందని సీపీఐ నేతలు పేర్కొంటు న్నప్పటికీ కాంగ్రెస్ నేతల్లో ఇంకా ఆశ చావలేదు. 

ఆశావాహుల్లో ఉత్కంఠ 

ఫస్ట్​ లిస్ట్​లో భద్రాచలం, రెండో లిస్ట్​లో పినపాక క్యాండిడేట్లను ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్  కొత్తగూడెం, ఇల్లెందు, అశ్వారావుపేట  క్యాండిడెట్ల సెలెక్షన్​పై మల్లాగుల్లాలు పడుతోంది. ఇల్లెందు టికెట్ కోరం కనకయ్యకు, అశ్వారావుపేట టికెట్ జారే ఆదినారాయణకు ఇవ్వాలంటూ పొంగులేటి పట్టుపడ్తున్నట్టు తెలిసింది. కనకయ్యకు కాకుండా చీమల వెంకటేశ్వర్లు, డాక్టర్​ రవిబాబులలో ఎవరో ఒకరికి ఇవ్వాలని  విక్రమార్క పట్టుపడ్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఓ దశలో టికెట్​కనకయ్యకు ఫైనల్ అయిందనే ప్రచారం జరగడంతో ఆయనకు టికెట్​ ఇవ్వొద్దంటూ పలువురు  కాంగ్రెస్​ నేతలు ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీస్ ఎదుట ఆందోళన చేశారు.

కనకయ్యకు వ్యతిరేకంగా కాంగ్రెస్​లోని కొందరు  లీడర్లతో బీఆర్ఎస్​అభ్యర్థి, ఎమ్మెల్యే హరిప్రియ ఆందోళన చేయిస్తున్నారని ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు.  అశ్వారావుపేటలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ సున్నం నాగమణిలకు టికెట్​ ఇవ్వాలంటూ భట్టి, రేణుక చక్రం తిప్పుతున్నట్టుగా పార్టీ వర్గాల్లో  ప్రచారం సాగుతోంది. 

కొత్తగూడెం తమదే అంటున్న సీపీఐ

మరో వైపు కొత్తగూడెం సీటు పొత్తులో భాగంగా తమకే ఫైనల్​ అయిందని సీపీఐ నేతలు చెప్తున్నారు. ఈ మేరకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో పాటు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి సాబీర్​ పాషా గ్రామస్థాయిలో ప్రచారం ప్రారంభించారు.  కాంగ్రెస్​ ఆశావహుల్లో మాత్రం టికెట్​పై ఇంకా ఆశ చావలేదు. కొత్తగూడెం టికెట్ ఆశిస్తున్న టీపీసీసీ జనరల్​ సెక్రెటరీ ఎడవల్లి కృష్ణతో పాటు మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు ఎవరికి వారు తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నారు.