రెండు ఓటీటీల మధ్య ముదిరిన కాపీ కాంట్రవర్సీ.. కథ మాదంటే, మాదంటూ పరస్పర ఆరోపణలు

రెండు ఓటీటీల మధ్య ముదిరిన కాపీ కాంట్రవర్సీ.. కథ మాదంటే, మాదంటూ పరస్పర ఆరోపణలు

వర్ష బొల్లమ్మ లీడ్ రోల్‌‌‌‌లో ప్రశాంత్ కుమార్ దిమ్మల తెరకెక్కించిన వెబ్ సిరీస్‌‌‌‌ ‘కానిస్టేబుల్ కనకం’. కోవెలమూడి సత్య సాయిబాబా, వేటూరి హేమంత్ కుమార్  నిర్మించారు. రాజీవ్ కనకాల, మేఘలేఖ, రమణ భార్గవ్ కీలక పాత్రలు పోషించారు. త్వరలో ఈటీవీ విన్‌‌‌‌లో స్ట్రీమింగ్ కానుంది.

మరోవైపు ఇదే తరహా కథతో ‘విరాట పాలెం : పీసీ మీనా రిపోర్టింగ్‌‌‌‌’అనే వెబ్ సిరీస్‌‌‌‌ జీ 5 ఓటీటీలో ఈ నెల 27 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో తమ కథను కాపీ కొట్టారంటూ ‘కానిస్టేబుల్‌‌‌‌ కనకం’మేకర్స్‌‌‌‌ బుధవారం ప్రెస్‌‌‌‌మీట్ నిర్వహించారు. 

దర్శకుడు ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ ‘ఓ దర్శకుడిగా నా కథను ఒక సంస్థకు చెప్పడంతో పాటు అన్ని ఎపిసోడ్స్‌‌‌‌ ఈ మెయిల్స్‌‌‌‌ రూపంలో పంపాను.  కొంత వర్క్ జరిగాక వాళ్లు వద్దనుకున్నారు. నేను అదే కథను ఈటీవీ విన్‌‌‌‌ కోసం వెబ్‌‌‌‌ సిరీస్‌‌‌‌గా తీస్తున్నా. అయితే ఇటీవల ఆ సంస్థ నుంచి వచ్చిన వెబ్ సిరీస్‌‌‌‌ ట్రైలర్‌‌‌‌‌‌‌‌లోని కథకు, నా కథకు దగ్గరి పోలికలు ఉన్నాయి. అందుకు తగ్గ ఆధారాలు కూడా ఉన్నాయి. న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. ప్రస్తుతం కేసు నడుస్తోంది’ అని చెప్పాడు.

‘ఈ కథను 2022లో రిజిస్టర్ చేశాం. ఒక ఒరిజినల్ కథను తీసుకొని అందులో ఓ మెలిక పెట్టినంత మాత్రాన అది అసలైన కథ కాదు. దొంగతనం చేసి, ముందుగా వస్తే దొరలయిపోతామని ఇలా చేశారు. ఈ విషయంలో ఎలాంటి న్యాయపోరాటానికైనా సిద్ధం’అని ఈటీవీ విన్‌‌‌‌ కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి, బిజినెస్ హెడ్ సాయికృష్ణ తెలియజేశారు. మరి ఈ న్యాయపోరాటంలో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.