
- మరణాల్లో 83 శాతం 10 రాష్ట్రాల్లోనే నమోదు
- మహారాష్ట్రలో అత్యధికంగా 37 వేల మంది మృతి
- 64 లక్షలు దాటిన బాధితులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి లక్ష మందిని బలి తీసుకుంది. శుక్రవారం కరోనా మరణాల సంఖ్య లక్ష దాటిపోయింది. మృతుల్లో 83 శాతం మంది 10 రాష్ట్రాలకు చెందిన వాళ్లే ఉన్నారు. మరోవైపు కరోనా బాధితుల సంఖ్య 64 లక్షలు దాటిందని కేంద్ర హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 81 వేల కేసులు నమోదయ్యాయని, వెయ్యి మందికి పైగా చనిపోయారని తెలిపింది. దేశంలో 83.37% కరోనా మరణాలు, 76.62% యాక్టివ్ కేసులు10 రాష్ట్రాల్లోనే నమోదయ్యాయని కేంద్రం పేర్కొంది. అయితే, దేశంలో ఒక మిలియన్ జనాభాకు 4,453 కేసులు, 70 మరణాలే నమోదు అయ్యాయని, ఇది ప్రపంచంలోనే లోయెస్ట్ అని తెలిపింది. అమెరికా, బ్రెజిల్ తర్వాత ఇండియాలోనే ఎక్కువ మరణాలు రికార్డ్ అయ్యాయి. అమెరికాలో 2.12 లక్షలు, బ్రెజిల్ లో 1.44 లక్షల మంది వైరస్ కు బలైపోయారు. కేసుల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది. ఆ దేశంలో 75 లక్షల కేసులు నమోదయ్యాయి. అమెరికా తర్వాత మనదేశంలో అత్యధికంగా 64 లక్షల మందికి వైరస్ సోకింది. శుక్రవారం నాటికి దేశంలో ఇంకా 9.49 లక్షల యాక్టివ్ కేసులున్నాయి. కోలుకున్నవారి సంఖ్య 54 లక్షలకు చేరింది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 14 లక్షల కేసులు నమోదు కాగా, 37 వేల మంది చనిపోయారు. కర్నాటక, తమిళనాడులో మరణాలు 9 వేలను దాటాయి. ఏపీ, యూపీ, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్ లో 5 వేలకు పైగా మరణాలు రికార్డ్ అయ్యాయి. కాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా పేషెంట్ల రికవరీలో మన దేశమే ఫస్ట్ ప్లేస్ లో నిలిచిందని అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది.