
(వెలుగు, నెట్వర్క్) ట్రీట్మెంట్ కోసం జిల్లాల నుంచి హైదరాబాద్ వస్తున్న కిడ్నీ పెషెంట్లు, కేన్సర్ రోగులు కరోనా బారిన పడుతుండటం కలవరపెడుతోంది. ఇలా కరోనా బారిన పడిన వారిలో చాలా మంది మృత్యువాతపడుతున్నారు. మొదట్లో టెస్టులు చేసినప్పుడు నెగెటివ్ వచ్చిన వారికి తర్వాత పాజిటివ్ రావడం ఈ అనుమానాలకు బలాన్నిస్తోంది. జిల్లాల నుంచి ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ వచ్చిన నలుగురు సోమవారం కరోనాతో చనిపోయినట్టు అనుమానిస్తున్నారు. వీరికి లింకులు కూడా దొరకకపోవడంతో ఎక్కడ వైరస్ సోకిందో తెలియని పరిస్థితి ఉంది. జిల్లాల నుంచి ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ వచ్చే వారు హాస్పిటల్స్లోనూ జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూ చిస్తున్నారు.
- జనగామ జిల్లా మరిగడికి చెందిన 25 ఏండ్ల మహిళ కొన్నాళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. నిమ్స్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటుండగా 6న చనిపోయింది. అదే రోజు పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. ఈమెకు లింకు దొరకకపోవడంతో హాస్పిటల్లోనే కరోనా సోకి ఉంటుందని ఆఫీసర్లు చెబుతున్నారు.
- కరీంనగర్జిల్లా కాట్రపల్లికి చెందిన వ్యక్తి(60) కిడ్నీ, లివర్ సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ నెల 5న పరిస్థితి విషమించగా, వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ కరోనా పాజిటివ్ అని తేలగా, 6న మరణించాడు.
- ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన రేషన్ డీలర్ కు కిడ్నీ సమస్య ఉంది. ఏప్రిల్22న హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరాడు. ట్రీట్మెంట్ పొందుతుండగా, కరోనా సోకింది. గాంధీకి తరలించగా మే 29న మృతి చెందాడు.
- ఖమ్మం జిల్లా మధిరకు చెందిన 65 ఏళ్ల వ్యక్తి బోన్ కేన్సర్తో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్హాస్పిటల్లో మే మొదటి వారంలో చేరాడు. మే 22న పాజిటివ్ గా తేలింది. ట్రీట్మెంట్ తీసుకుంటూ అదే నెల 25న చనిపోయాడు.
- మహబూబ్నగర్ జిల్లా అమిస్తాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అనారోగ్యంతో నిమ్స్ లో టెస్టులకు వెళ్లాడు. తిరిగివచ్చాక కరోనా లక్షణాలు కనిపించగా టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. ఇదే జిల్లా వేపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి అనారోగ్యంతో ఉస్మానియాలో చేర్చారు. డిశ్చార్జీ చేసిన మరుసటి రోజే పాజిటివ్ అని తేలింది.
- మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ శివారు సోమ్లా తండాకు చెందిన ఓ వ్యక్తి మే 30న బైక్ పై వెళ్తూ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కాలు ఆపరేషన్ కోసం నిమ్స్ కు తరలించారు. ట్రీట్మెంట్ పొందుతున్న క్రమంలో పాజిటివ్ గా తేలింది.
- యాదాద్రి జిల్లా రాజాపేట మండలానికి చెందిన ఓ గర్భిణి(23) రక్తహీనతతో బాధపడుతూ హన్మకొండ హాస్పిటల్కు వెళ్లింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడడంతో గాంధీకి రెఫర్ చేశారు. మే 30న డెలివరీ కాగా, జూన్1న బాబు, ఆమె చనిపోయారు. మరుసటి రోజు కరోనా అని తేలింది.
జగిత్యాల జిల్లా ఐలపూర్ కు చెందిన ఓ యువకుడు(38) కరోనాతో సోమవారం మృతిచెందాడు. బ్లడ్ కేన్సర్ తో15 రోజులపాటు హైదరాబాద్లోని ఓ క్యాన్సర్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందాడు. అదే వార్డులోని మరో వ్యక్తి ద్వారా కరోనా సోకింది. 6న పాజిటివ్ అని తేలగా, 8న చనిపోయాడు.
నాగర్ కర్నూల్జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళ(36) సోమవారం కరోనాతో చనిపోయింది. గత నెల 27న కిడ్నీ వ్యాధితో నిమ్స్లో చేరింది. కరోనా టెస్టులు చేయగా మొదట నెగెటివ్ వచ్చింది. 5న మరోసారి టెస్టు చేయగా పాజిటివ్ అని తేలింది.
కరీంనగర్ జిల్లా వల్భాపూర్ కు చెందిన ఓ యువకుడు(32) కరోనాతో సోమవారం చనిపోయాడు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఇతడిని వారం క్రితం నిమ్స్ కు తీసుకెళ్లారు. పక్కన ఉన్న పేషెంట్ ద్వారా కరోనా సోకడంతో గాంధీకి తరలించగా, సోమవారం చనిపోయాడు.
పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పోతన కాలనీలో ఉండే సింగరేణి ఉద్యోగి సోమవారం కరోనాతో చనిపోయాడు. కొద్దికాలంగా బోన్కేన్సర్తో బాధపడుతున్న అతడు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కీమో థెరపీ చేయించుకుంటున్నాడు. నాలుగు రోజుల క్రితం జ్వరం రావడంతో టెస్ట్చేయగా పాజిటివ్అని తేలింది. గాంధీకి రెఫర్చేయగా, అక్కడికి తరలిస్తుండగా చనిపోయాడు.