
కరోనా మహమ్మారి సోకి ఒకే కుటుంబానికి చెందిన తల్లీకొడుకులిద్దరూ మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం తల్లి మృతి చెందగా.. ఈ శుక్రవారం కొడుకు కూడా కోవిడ్ కారణంగా మృత్యువాత పడడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణానికి చెందిన చీర్లంచ లచ్చవ్వ అనే వృద్ధురాలు రెండు రోజుల క్రితం మృతి చెందింది. ఆమె అంత్యక్రియల తర్వాత కరోనా పాజిటివ్ అని తేలడం తో కుటుంబీకులు, బంధువులు మరియు అంత్యక్రియలకు హాజరైన వారందరు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. శుక్రవారం ఉదయం ఆమె కొడుకు శ్రీనివాస్ (58) శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని కుటుంబీకులకు తెలిపాడు. వారు 108 కు ఫోన్ చేసి విషయం తెలపగా కోవిడ్ టెస్ట్ చేయించుకున్నట్టు సర్టిఫికెట్ ఉంటేనే అంబులెన్స్తో పంపుతామన్నారు. 108 సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం తో శ్రీనివాస్ చనిపోయారు.
విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ నర్సయ్య, వైద్య సిబ్బంది కలిసి బాధిత కుటుంబాన్ని క్వారంటైన్ కు తరలించి, అంబులెన్స్ ద్వారా అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉండగా శవాన్ని ఓ కవర్తో ప్యాకింగ్ చేసి ఇంటిముందు పడేసి వెళ్లిపోయారు. మృతుని కుటుంబీకులందరూ కూడా క్వారెంటన్ కు వెళ్లడంతో మృతదేహం వద్దకు వెళ్లడానికి ఏ ఒక్కరూ ముందుకు పోలేదు. ఉదయం పదకొండు గంటలకు చనిపోయిన మృతదేహాన్ని సాయంత్రం ఐదు గంటల వరకు అంత్యక్రియలు జరపకపోవడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. చుట్టుపక్కల వారు కొంతమంది పై అధికారుల దృష్టికి తీసుకెళ్లగా మళ్లీ మున్సిపల్ సిబ్బంది వచ్చి అంబులెన్స్ ద్వారా అంత్యక్రియలు నిర్వహించారు.