
అమరావతి, వెలుగు: ఏపీలో కరోనా టెస్టులు లక్ష దాటాయి. శుక్రవారం నాటికి 1 లక్ష 997 మందికి టెస్టులు చేసినట్లు హెల్త్ డిపార్ట్మెంట్అధికారులు చెప్పారు. ప్రతి పది లక్షల మందికి 1,919 టెస్టులతో ఏపీ టాప్ లో ఉందని తెలిపారు. గడిచిన 24 గంటల్లో 7,902 టెస్టులు చేయగా 60 మందికి పాజిటివ్ గా తేలిందన్నారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 1,463కు చేరిందని వెల్లడించారు. కర్నూలు జిల్లా లో 25, గుంటూరు 19, కడప 6, అనంతపురం 6, విశాఖపట్నం 2 , వెస్ట్ గోదావరి జిల్లాలో 2 కొత్త కేసులు నమోదైనట్లు చెప్పారు. ఇప్పటివరకు 31 మంది చనిపోగా 403 మంది డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు. వివిధ హాస్పిటళ్లలో 1,027 మందికి ట్రీట్ మెంట్ అందిస్తున్నట్లు చెప్పారు.
రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లు ఇవే…
ఏపీలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల వివరాలను ప్రభుత్వం ప్రకటించింది. కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు రెడ్ జోన్ లో ఉన్నట్లు చెప్పింది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కడప, అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాలలు ఆరెంజ్ జోన్ లో ఉన్నట్లు తెలిపింది. విజయనగరం జిల్లా మాత్రమే గ్రీన్ జోన్ లో ఉన్నట్లు వెల్లడించింది. రెడ్ జోన్ జిల్లాలైన కర్నూలు జిల్లాలో 411, గుంటూరు 306, కృష్ణా జిల్లాలో 246 కేసులు నమోదయ్యాయి.
అవనిగడ్డ నుంచి సొంతూళ్లకు స్టూడెంట్స్
లాక్ డౌన్ వల్ల గుజరాత్ లో చిక్కుకున్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలకు 4,385 మంది జాలర్లు 56 బస్సుల్లో స్వస్థలాలకు చేరుకున్నారు. చెన్నై నుంచి 84 మంది మత్స్యకారులు శ్రీకాకుళం జిల్లా కవిటికి చేరుకున్నారు. వీరందరనీ క్వారంటైన్ కు తరలించారు. రాజస్థాన్ కు చెందినవారిని అనంతపురం నుంచి ప్రత్యేక బస్సుల్లో తరలించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో చిక్కుకున్న వివిధ ప్రాంతాలకు చెందిన 390 మంది స్టూడెంట్స్ ను అధికారులు స్వస్థలాలకు పంపించారు.
నిరంతరం పరిశీలించండి: సీఎం జగన్
క్వారంటైన్ కేంద్రాలను నిరంతరం పరిశీలించాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కరోనా నివారణ చర్యలపై శుక్రవారం అమరావతిలోని క్యాంపు ఆఫీసులో ఆయన సమీక్షించారు. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని, వారందరినీ స్క్రీనింగ్ చేయాలని అవసరమైతే క్వారంటైన్ లో ఉంచాలని సూచించారు. క్వారంటైన్ కేంద్రాల్లో వసతులపై ఎప్పటికప్పడు సమీక్షించాలన్నారు.