తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు అలిపిరి వద్ద క్రమం తప్పకుండా కరోనా పరీక్షలు నిర్వహించాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం తన ఛాంబర్లో అదనపు ఈవో ధర్మారెడ్డి, జేఈవో బసంత్ కుమార్, జిల్లా కలెక్టర్ భరత్ గుప్తాలతో సమావేశమయ్యారు. కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ఈ సందర్భంగా తిరుమలలో పని చేసే ఉద్యోగుల నుంచి రోజుకు 100 కరోనా టెస్టు శాంపిల్స్ తీయాలని అధికారులను ఆదేశించారు ఈవో సింఘాల్. ఈ టెస్టుల రిపోర్టులు 24 గంటల్లోగా వచ్చేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ను కోరారు. తిరుమలలో పనిచేసే ఉద్యోగులు వారం రోజుల పాటు వరుసగా ఒకే చోట పనిచేసేలా డ్యూటీలు వేయాలని అధికారులను ఆదేశించారు. తిరుపతి సెంట్రల్ హాస్పిటల్లో ఉద్యోగుల కోసం కొన్ని వెంటిలేటర్లు ఏర్పాటు చేయాలన్నారు. పరిస్థితిని సమీక్షించి బర్ద్ ఆసుపత్రిని కరోనా రోగుల చికిత్సకు ఉపయోగించే విషయంపై వారంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తిరుపతిలోని శ్రీనివాసం యాత్రికుల సముదాయాన్ని జిల్లా కలెక్టర్కు అప్పగించాలని జేఈవోను ఆదేశించారు. టీటీడీ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఎవరికైనా క్వారంటైన్ అవసరమైతే మాధవంలో ఏర్పాట్లు చేయాలని సూచించారు ఈవో సింఘాల్. వీటి పర్యవేక్షణకు ఒక డిప్యూటీ ఈవో, ఇద్దరు ఏఈవోలు, అవసరమైనంత మంది సిబ్బందిని నియమించి, వైద్య పరికరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
