
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని అంతం చేసే వ్యాక్సిన్ తయారీ కోసం హైదరాబాద్ కు చెందిన బయో టెక్నాలజీ కంపెనీ ప్రయోగాలు చేస్తోంది. ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ (ఐఐఎల్) శాస్త్రవేత్తలు.. ఇందు కోసం ఆస్ట్రేలియాకు చెందిన గ్రిఫిత్ యూనివర్సిటీతో రీసెర్చ్ చేసస్తున్నట్లు ఆ కంపెనీ వెల్లడించింది. రెండు సంస్థల శాస్త్రవేత్తలు కలిసి కాడన్ డీ-ఆప్టిమైజేషన్ టెక్నాలజీ ద్వారా లైవ్ అలెన్యుయేటెడ్ వ్యాక్సిన్ తయారీ కోసం ప్రయోగాలు సాగిస్తున్నామని తెలిపింది.
వైరస్ నే వ్యాక్సిన్ గా మార్చి…
కరోనా వైరస్ నే వ్యాక్సిన్(లైవ్ అలెన్యుయేటెడ్ వ్యాక్సిన్)గా మార్చే దిశగా ప్రయోగాలు సాగుతున్నాయని ఐఐఎల్ తెలిపింది. ఈ వ్యాక్సిన్ ను ఒక్క సింగిల్ డోస్ ప్రజలకు ఎక్కిస్తే కరోనాను ఎదుర్కొనే ఇమ్యూనిటీ వస్తుందని పేర్కొంది. ప్రయోగాలు పూర్తయ్యాక వ్యాక్సిన్ సిద్ధమైతే అది హైదరాబాద్ లోని ఐఐఎల్ కు వస్తుందని, ఆ తర్వాత దశల వారీ క్లినికల్ ట్రయల్స్ తోపాటు సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ సంస్థల ఆమోదం తీసుకుంటామని ఆ కంపెనీ వెల్లడించింది.
చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచమంతా వేగంగా వ్యాపించింది. వంద రోజుల్లోనే లక్ష మందిని ఈ మహమ్మారి బలి తీసుకుంది. ఇప్పటి వరకు 17 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా.. 3.82 లక్షల మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. భారత్ లో శనివారం నాటికి సుమారుగా ఏడున్నర వేల మందికి కరోనా సోకింది. అందులో 250 మంది వరకు మరణించగా.. 700 మందికి పైగా డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు ఈ వైరస్ నియంత్రణకు నిర్ధిష్టమైన మందులు లేవు. అయితే హైడ్రాక్సీ క్లోరోక్విన్ వంటి కొన్ని మందులు పని చేస్తున్నాయని, పేషెంట్లకు వాడుతున్నారు. రోగ నిరోధక శక్తి మంచిగా ఉన్న వాళ్లు కోలుకోగలుగుతున్నారు.