న్యూఢిల్లీ: మన దేశ మార్కెట్ సైజు పది కోట్లు మాత్రమే ఉంటుందని, ఈ విషయంలో స్టార్టప్ కంపెనీలు అతిగా ఊహించుకున్నాయని స్టాక్ బ్రోకింగ్ కంపెనీ జెరోధా ఫౌండర్ నితిన్ కామత్ అన్నారు. ఫోన్పే కో–ఫౌండర్ సమీర్ నిగమ్ కూడా ఈ వాదనను అంగీకరించారు.
బెంగళూరులో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో వీళ్లు మాట్లాడుతూ స్టార్టప్లు, వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్లు మార్కెట్ సైజు గురించి పొరపాటు అంచనాకు రావడం వల్ల కొన్ని స్టార్టప్లలో పాలనాపరమైన సమస్యలు వచ్చాయని అన్నారు. ఇండియా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమే అయినా, స్టార్టప్ మార్కెట్ సైజు తక్కువగానే ఉందని కామత్ అన్నారు.
ఈ సంవత్సరం దీపావళి నాటికి ఫోన్పే 50 కోట్ల మంది కస్టమర్లను చేరుకుంటుందని, ప్రస్తుతం తమకు 30 కోట్ల వార్షిక యాక్టివ్ యూజర్ బేస్ ఉందని నిగమ్ చెప్పారు. పది కోట్ల మంది మాత్రమే కంపెనీ ఆర్థిక సేవలను, ఉత్పత్తులను కొనుగోలు చేసే అవకాశం ఉందని నిగమ్ చెప్పారు.
మార్కెట్ సైజును పదేళ్ల ముందుచూపుతో అంచనా వేయాలని, టార్గెట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిగమ్ వివరించారు.