కౌశిక్ రెడ్డిపై బీజేపీ కార్పొరేటర్ ఫిర్యాదు

కౌశిక్ రెడ్డిపై బీజేపీ కార్పొరేటర్ ఫిర్యాదు

రాష్ట్రంలో ప్రగతిభవన్ వర్సెస్ రాజ్ భవన్ మధ్య నడుస్తోన్న కోల్డ్ వార్ ఇప్పుడు ఓపెన్ వార్ గా మారింది. ఇరువైపుల మాటల యుద్ధం ఇప్పుడు తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలోనే రిపబ్లిక్ డే రోజు గవర్నర్ తమిళిసైని అగౌరవ పరిచేలా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. తాజాగా ఈ విషయంపై సరూర్ నగర్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి.. కౌశిక్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

‘ఒక మహిళా గవర్నర్ పై చేసిన వ్యాఖ్యలు మొత్తం మహిళా సమాజంపైన చేసినట్లే. మహిళలందరినీ అవమానించినట్లే. అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి తన ఫిర్యాదులో కోరారు. రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర వేడుకలు అధికారికంగా జరపకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన గవర్నర్ కేంద్రానికి లేఖ రాశారు. దీనికి కౌంటర్ గా కౌశిక్ రెడ్డి గవర్నర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.