అనుమతులల్లోనూ అవినీతి

అనుమతులల్లోనూ అవినీతి

ప్రభుత్వాలలో అవినీతికి అనేక రూపాలు ఉంటాయి.  ఆధునిక అభివృద్ధితోపాటు అవినీతి కూడా రూపురేఖలు మార్చుకుంటూ వస్తున్నది.  నగదు పట్టుకుంటున్నారు అని ఒక అధికారి ఆన్​లైన్​ మార్పిడికి ఒడిగట్టిన సంగతి తెలిసిందే.  గత 70 ఏండ్లకు పైగా అవినీతి పెరుగుతున్నదే తప్పితే తగ్గింది లేదు. అయితే, ఆది నుంచి అవినీతికి ఒక మూలం ప్రభుత్వం ఇచ్చే అనుమతులు.  ప్రభుత్వంలో అవినీతి అధికారులు అక్రమంగా అనుమతులు (permissions), ఆమోదాలు (approvals), లైసెన్సింగ్ (licensing) ఇవ్వడం ద్వారా కోట్లు సంపాదించారు. నగరాభివృద్ధికి ఒక క్రమబద్ధ నిర్మాణాలు అవసరం అవుతాయి. 

ఎవరికివారు ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటే నివాస పరిస్థితులు ఘోరంగా ఉంటాయి.  ఒక క్రమబద్ధ భవన నిర్మాణప్రక్రియ కోసం నిబంధనలు, వాటిని అమలు చేయటానికి అనుమతులు అవసరం అయ్యాయి. అయితే, ఈ అనుమతులు ఇవ్వడానికి లంచం తీసుకోవడం అధికారులకు అలవాటు అయ్యింది.  లంచం ఇస్తున్నాం కాబట్టి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఒక విశ్లేషణ. 

అనేక విషయాలలో ప్రభుత్వ నియంత్రణ చాలా అవసరం.  వస్తువులు కావచ్చు, సేవలు కావచ్చు, వాటన్నింటికి అవసరమైన ముడి, ప్రకృతి వనరులు కావచ్చు, సమస్తం ప్రభుత్వ నియంత్రణలో ఉంటే అందరికీ వాటిని అందుకునే అవకాశం ఉంటుంది.  ప్రభుత్వంలో ఉన్న  ప్రతిశాఖకు ఏదో ఒక అనుమతుల బాధ్యత ఉంటుంది.  ప్రతి అనుమతికి కొన్ని విధివిధానాలు ఉన్నాయి. ఈ విధివిధానాలలో ఖచ్ఛితత్వం లేకపోవడం వల్ల వాటిని నిర్వచించడంలో ఉన్న వెసులుబాటును వాడుకుని అనుమతులను ఇస్తుంటారు అధికారులు. అయితే, ఈ అనుమతులు కొన్ని శాశ్వతం, కొన్ని కాలానుగుణంగా ఉంటాయి.  

అన్నీ సక్రమంగా ఉన్నా లంచాలు ఇవ్వాల్సి రావడం ఒక కోణం అయితే అర్హత లేకున్నా, ఏర్పరిచిన విధి విధానాల బట్టి లేకున్నా లంచం ద్వారా సంపాదించే పద్ధతులు పెరుగుతున్నాయి. నిబంధనలను బట్టి ఒక ప్రాంతంలో 3 అంతస్తుల భవనం కట్టాల్సి ఉండగా దాని బదులు 4 లేక 5 అంతస్తుల భవనం కట్టడం దీనికి ఒక ఉదాహరణ.  ఇసుక తవ్వకాలు కూడా ఈ కోవలోకి వస్తాయి. ఖనిజాల మైనింగ్​లో కూడా ఈ రకమైన ఉల్లంఘనలు చూస్తున్నాం. అనుమతిచ్చిన దానికంటే ఎక్కువ కట్టడం, తీయడం వగైరా అన్నీ కూడా అవినీతి వల్లనే. 

యధేచ్ఛగా అనుమతుల ఉల్లంఘన

2017లో క్యాడబరి సంస్థ హిమాచల్​ప్రదేశ్ బడ్డిలో ఏర్పాటు చేయదలిచిన ఉత్పత్తి కేంద్రానికి కావాల్సిన 30 రకాల లైసెన్సులు, అనుమతుల కోసం దాదాపు లక్ష డాలర్లు మధ్య దళారికి చెల్లించిందని అమెరికా ప్రభుత్వ సంస్థ నిర్ధారించింది. ఈ మధ్య అవినీతిని పెంచి పోషించినవారికి కూడా అవినీతి భారం ఎక్కువ అనిపిస్తున్నది. అందులోనుంచి పుట్టుకు వచ్చిందే సింగిల్ విండో క్లియరెన్స్, ఆ తరువాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అందరికీ లంచాలు పంచే బాధ్యత నుంచి తప్పుకోవాలని నిబంధనల సరళీకరణ కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పద్ధతి తీసుకువచ్చారు.  

దీనికింద అనుమతులు ఇచ్చే ప్రక్రియలో ఆయా అనుమతులకు కాల సమయం నిర్ధారించి తగ్గించారు. ఇదివరకు కొన్ని నెలలు పట్టేది రోజులలోనే  ఇవ్వాలని నిబంధనలు సవరించారు.  కొన్ని నిబంధనలను ఎత్తివేశారు. ఆశ్చర్యంగా అనుమతులు పరిమిత కాలంలో ఇవ్వకుంటే సదరు ప్రభుత్వ ఉద్యోగి మీద చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.  తెలంగాణ  ప్రభుత్వమైతే ఏకంగా చట్టమే తీసుకువచ్చింది. పెద్ద కంపెనీలకు ఇది వరంగా మారింది.  చిన్న, మధ్య తరహా కంపెనీలకు అనుమతులలో జాప్యం, అవినీతి తగ్గలేదు. అనుమతులను ఉల్లంఘించి పరిమితులు దాటి చేపట్టిన నిర్మాణం, తవ్వకాలు, వగైరా వాటి మీద చర్యలు లేకపోవడం. అక్రమ భవన నిర్మాణాల వల్ల వరదలు, ఇతర దుష్పరిణామాలు ఏర్పడితే  సదరు అధికారి మీద కూడా చర్యలు లేవు. 

అవినీతి కేంద్రీకృతం

చాలా విపరీత స్థాయిలో అనుమతుల ప్రక్రియలను సరళీకృతం చేయడం వల్ల అవినీతి మాత్రం తగ్గ
లేదు. కాకపోతే,  కేంద్రీకృతం అయ్యింది.  పంచాయతీ నుంచి మండలం, మండలం నుంచి జిల్లా, జిల్లా నుంచి రాష్ట్రం, రాష్ట్రం నుంచి దేశం స్థాయికి అనుమతులు కేంద్రీకృతం అవుతున్నాయి. 

ఆయా కంపెనీలు ఎంత తక్కువమందితో అనుమతులు సాధ్యమయితే అంత మంచిది అని భావిస్తున్నాయి. అవినీతి సరళీకరణ వల్ల, కేంద్రీకరణ చేయడం వల్ల తగ్గడం లేదు. కాకపోతే, పెద్ద కంపెనీలు మాత్రం బాగుపడుతున్నాయి. చిన్న, మధ్య తరహా కంపెనీలకు అవినీతి, లంచాల భారం షరా మామూలే. దీని పరిణామంగా ఆర్థిక రంగంలో, ఉత్పత్తి, సేవల రంగంలో పోటీ తగ్గుతున్నది. గుత్తాధిపత్యం పెరుగుతున్నది.  

నామమాత్రంగా పర్యావరణ అనుమతులు

పర్యావరణ అనుమతులు అన్నీ ప్రాజెక్టులను ఆలస్యం చేస్తున్నాయని వ్యాపారులు, పెట్టుబడిదారులు, అధికారులు,  ప్రజాప్రతినిధులు, మంత్రులు గగ్గోలు పెడుతుంటారు.  వీరి ఆందోళనకు  ప్రధాన కారణం పర్యావరణ అనుమతుల  ప్రక్రియలలో ప్రజల అంగీకారం కీలకంగా ఉండడమే.  మిగతా అనుమతులలో ప్రజలు పాల్గొనే అవకాశాలు తక్కువ.  ప్రజలకు తెలిసేప్రక్రియల వల్ల ఆలస్యం అవుతుందని అని నిర్ణేతలు భావిస్తున్నారు.  అనుమతులలో ఉండాల్సింది ప్రజల భాగస్వామ్యం. అప్పుడే అవినీతిపరుల  ఆటలు ఆగుతాయి. 

అయితే,  ప్రజలు మైనింగ్,  పారిశ్రామిక, పట్టణాభివృద్ధి  ప్రాజెక్టులను  ప్రశ్నిస్తున్నారని మొదట్లో శాస్త్రవేత్తల కమిటీలను నియమించారు, ఆనక ఈ కమిటీల వల్ల కూడా అలస్యమవుతున్నాయని  అనేక నిబంధనలను, ప్రక్రియలను ఎత్తివేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఆ అనుమతుల ప్రక్రియలు అన్నీ నామమాత్రంగా మార్చారు. కొన్ని ప్రాజెక్టులకు ముందస్తు పర్యావరణ అనుమతి నుంచి మినహాయింపునిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటి ఫికేషన్‌‌‌‌‌‌‌‌పై ఇటీవల సుప్రీంకోర్టు స్టే విధించింది. పర్యావరణ నిబంధనలను నీరుగార్చడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిల్​ విషయంలో  ఈ నిర్ణయం వెలువడింది. అనుమతులలో సరళీకరణ వల్ల పర్యావరణానికి హానికరమైన ప్రభావాలు పెరుగుతాయి.  ముందు ప్రాజెక్టు చేపట్టి తరువాత అనుమతులు తీసుకోవడం కూడా ఒక రివాజుగా మారింది. ఇది కూడా అవినీతిలో భాగమే. 

పారదర్శకతతో అవినీతి నియంత్రణ అధికారులలో సామర్థ్యలేమి కూడా అవినీతి కార్యకలాపాలకు దోహదం చేస్తుంది. భారతదేశంలో పెరుగుతున్న అవినీతి.. ప్రభుత్వం ఇచ్చే ఆమోదాలు, అనుమతులతో ముడిపడి ఉంటున్నది. అనేక అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితులలో దళారీ వ్యవస్థ కూడా తయారు అయ్యింది. అందుకే పరిశ్రమలకు, ఇంకా బహుళ అనుమతుల విషయంలో అవినీతి తగ్గించటానికి సింగిల్ విండో క్లియరెన్స్ (ఏక గవాక్ష అనుమతులు) ప్రయత్నం జరిగింది. దానితో సఫలం కాక తెలంగాణ ప్రభుత్వం టిఎస్​ఐపాస్ (ts-ipass) తెచ్చినా ఫలితం రాలేదు.  అనుమతులలో ప్రభుత్వ నియంత్రణ లేకపోతే సమాజంలో అసమానతలు పెరుగుతాయి. 

నీరు, భూమి, అడవులను, రవాణా, పట్టణాభివృద్ధి ప్రైవేటుపరం చేసిన దేశాలలో ఆర్థిక అసమానతలు చాలా ఎక్కువగా ఉన్నాయి.  సమ సమాజ స్థాపనకు, ప్రజాస్వామ్యబద్ధ అభివృద్ధికి  ప్రభుత్వం ఇవ్వాల్సిన ఆమోదాలు, అనుమతులకు సంబంధించిన అవినీతిని నిర్మూలించడానికి చట్టాలు, తగిన సంస్థాగత యంత్రాంగాలు ఉన్నప్పటికీ, వాటి ప్రభావం అంతగా లేదు. వివిధ రాష్ట్రాల్లో అవినీతి నిరోధక సంస్థలు ఉన్నప్పటికీ, అమలు బలహీనంగానే ఉంది.  

పట్టుకున్న అవినీతి అధికారుల మీద పడిన శిక్ష నామమాత్రమే. అమలులో నిర్లక్ష్యం, శిక్షణ పొందిన సిబ్బంది కొరత, అధిక పనిభారం ఉన్న న్యాయవ్యవస్థ కారణంగా అవినీతి నిరోధక, నివారణ చర్యలు ఫలితాలను ఇవ్వడం లేదు. ఇటువంటి పరిస్థితులలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలి.పారదర్శకతను విస్తృతం చేయాలి.  ప్రజలకు నిరంతరం  సమాచారం అందేలా ఏర్పాట్లు చేయడంవల్ల అనుమతులతో ముడిపడిన అవినీతిని నిలువరించవచ్చు. ఇదే సుస్థిర, దీర్ఘకాలిక పరిష్కారం.

అనుమతులలో అవినీతి తగ్గిస్తామని 

ఈ మధ్య డిజిటలీకరణ మొదలుపెట్టారు.  ప్రతి శాఖకు ఇప్పుడు డిజిటలీకరణ ఫ్యాషన్​గా మారింది.  కంప్యూటర్​, వెబ్​సైట్, డిజిటల్ పరికరాలు వచ్చిన తరువాత నిర్ణయాల క్రమం పూర్తిగా కేంద్రీకృతం అయింది. పారదర్శకత తగ్గింది.  ప్రభుత్వ అనుమతులు ప్రజలకు తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. 

- డా. దొంతి నరసింహారెడ్డి,
పాలసీ ఎనలిస్ట్​