- ఆగస్టు నెలలోనే రూ. 2.27 లక్షలు
- స్వీపింగ్ మిషన్ పేరుతో రూ.60 లక్షల వృథా
- అక్రమాలకు అడ్డాగా వనపర్తి మున్సిపాలిటీ
వనపర్తి, వెలుగు: వనపర్తి మున్సిపాలిటీలో రోజుకో అవినీతి బయపడుతోంది. ఇప్పటికే నమ్మ చెరువు కబ్జా, ఇష్టారాజ్యంగా షాపింగ్ కాంప్లెక్స్ల అద్దె వ్యవహారం బయటికి రాగా.. తాజాగా మీటింగుల్లో సభ్యులకు ఇచ్చే జిరాక్స్ పత్రాల పేరిట లక్షలు కాజేస్తున్న ఘటన వెలుగులో వచ్చింది. మున్సిపల్ ఆఫీసర్లు ఒక్కో జిరాక్స్ సెంటర్ కు ప్రతి నెలా రూ. లక్ష నుంచి రూ.2 లక్షలకు పైగా బిల్లులు చెల్లించడం వివాదాస్పదంగా మారింది. కేవలం 5 నెలల్లో 6 లక్షలకు పైగా ఖర్చు చేయడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రూ.60 లక్షలు పెట్టి కొనుగోలు చేసిన స్వీపింగ్ మిషన్ మూన్నాళ్లకే మూలకు పడడంపైనా ఆరోపణలు చేస్తున్నారు. కొత్త మిషన్ కోసం కొటేషన్లు తీసుకున్న ఆఫీసర్లు పాత మిషన్ కొనుగోలు చేసి రంగులు వేసి మాయ చేసినట్లు తెలుస్తోంది. అందుకే ఆది మూలకు పడిందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
జరిగేదే ఒకటి, రెండు మీటింగ్లు వనపర్తి మున్సిపాలిటీలో నెలకు ఒకటో రెండో సాధారణ సమావేశాలు జరుగుతుంటాయి. ఈ మీటింగ్కు హాజరయ్యే 33 మంది కౌన్సిలర్లకు ఆఫీసర్లు ఎజెండా పత్రాలను అందజేస్తారు. ఎంతకాదనుకున్నా ఒక్కొక్కరిని 5 నుంచి 10 పేజీలు ఇస్తారు. కానీ, వేల పేపర్లు జిరాక్స్ తీసినట్లు చూపించి.. వారికి అనుకూలంగా ఉండే జీరాక్స్ సెంటర్లకు రూ. లక్షల బిల్లులు చెల్లిస్తున్నారు. అనంతరం వారి నుంచి వాటాలు పంచుకున్నట్లు తెలుస్తోంది. ఆఫీసర్లు, కౌన్సిలర్లు కుమ్మక్కై ఈ తతంగాన్ని నడిపిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మున్సిపల్ సమావేశాలకు మీడియాకు పర్మిషన్ ఇవ్వకపోవడం ఇందుకు బలం చేకూరుస్తోంది.
నెలకు రూ. లక్ష పైనే
ఒక్క కాపీ జిరాక్స్ కావాలంటే సాధారణంగా ఒక రూపాయి తీసుకుంటారు. బల్క్ గా అయితే 50 పైసలకు కూడా తీస్తారు. కానీ, మున్సిపల్ ఆఫీసర్లు 2021 ఆగస్టులో గాయత్రి జిరాక్స్ సెంటర్కు రూ. 2,27,801
చెల్లించారు. అంటే దాదాపుగా 4 లక్షల పేపర్లు జిరాక్స్ తీసి ఉండాలి. సమావేశాలు జరిగేదే నెలకు ఒకటి, రెండు రోజులు. 33 మంది కౌన్సిలర్లు 20 పేపర్ల చొప్పున ఇచ్చినా 660
పేపర్లకు మించవు. ఇదే సెంటర్కు జనవరిలో రూ. లక్ష , వినాయక ఇంటర్ నెట్ కు రూ. 40,829, ఫిబ్రవరిలో గాయత్రి సెంటర్ కు రూ.1,13,559, మార్చిలో రూ. 94,648, జూన్లో వినాయక ఇంటర్ నెట్ కు రూ. 17,516 చెల్లించారు. మరో రూ. 4 లక్షల బిల్లులను చెల్లించేందుకు రంగం సిద్ధం చేశారు. 2020 జనవరిలో బాలాజీ జిరాక్స్ సెంటర్ కు రూ. 2,49,245, ఫిబ్రవరిలో రూ. 1,48,526 , మార్చిలో రూ. 1,32,638 చెల్లించారు. ఈ లెక్కన ప్రతి నెలా రూ. లక్ష నుంచి రూ.2 లక్షలకు పైగా జిరాక్స్ కాపీల పేరిట దోచుకుంటున్నారు.
రహస్యంగా ఉంచాల్సిన సమాచారం బయటికి..
రూ. 50 వేలు పెట్టి జిరాక్స్ మిషన్ కొనేస్తే అయిపోయే దానికి మున్సిపల్ ఆఫీసర్లు నెలకు లక్షలు ఖర్చు చేస్తుండడం విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు రహస్యంగా ఉంచాల్సిన కొన్ని ఫైళ్లను జిరాక్స్ పేరిట బయటికి పంపిస్తుండడంతో విలువైన సమాచారం లీక్ అవుతోంది. ప్రజల ఆస్తుల వివరాలు, పన్నుబకాయిల వివరాలు కూడా బయటికి వస్తున్నాయి. దీనిని కొందరు జిరాక్స్ సెంటర్ల యాజమానులు క్యాష్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అవసరం ఉన్న వారికి ఓ సెట్ ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
బయటి బిల్లులను ఆపేస్తాం
సభలు, సమావేశాలకు అవసరమైన సర్క్యులర్లు, ఇతర సెక్షన్లలో అవసరాలకు బయటి జిరాక్స్ సెంటర్లలో జిరాక్స్ తీసుకుంటున్నం. వాస్తవానికి జిరాక్స్ కాపీల అంశాన్ని కూడా టెండర్ పిలవాల్సి ఉన్నా.. సభ్యులు ప్రపోజల్పెట్టకపోవడంతో ప్రైవేట్ సెంటర్లలో కాపీలు తీయిస్తున్నం. ఈ పద్ధతిని రద్దు చేసి మున్సిపాలిటీలోనే జిరాక్స్ మిషన్ ను ఏర్పాటు చేస్తం.
- మహేశ్వర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్, వనపర్తి