
మధ్యప్రదేశ్,రాజస్థాన్లలో విషపూరిత దగ్గు సిరప్ల వినియోగంతో చిన్నారుల మృతి చెందిన ఘటనపై సుప్రీంకోర్టులో విచారణకు పిటిషన్ దాఖలైంది. కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు, దేశవ్యాప్తంగా ఔషధ భద్రతా విధానాలను సమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. వివిధ రాష్ట్రాల్లో విషపూరిత దగ్గు సిరప్ల కారణంగా జరిగిన పిల్లల మరణాలకు సంబంధించిన అన్ని పెండింగ్ FIRలు ,దర్యాప్తులను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)కి బదిలీ చేయాలని ఆదేశించాలని కూడా పిటిషనర్ కోర్టును కోరారు.
దగ్గు సిరప్ల తయారీ, పరీక్ష , పంపిణీపై సమగ్ర విచారణకు రిటైర్డ్ సుప్రీంకోర్టు జస్టిస్ నేతృత్వంలో జాతీయ న్యాయ కమిషన్ లేదా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని న్యాయవాది విశాల్ తివారీ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో కూడా డైథిలిన్ గ్లైకాల్ (DEG), ఇథిలిన్ గ్లైకాల్ (EG) సిరప్ లు మరణాలకు కారణమయ్యాయని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.
తమిళనాడుకు చెందిన డ్రగ్స్ తయారీ కంపెనీ మెస్సర్స్ శ్రేసన్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ లో ఉత్పత్తి అయిన కోల్డ్రిఫ్ కాఫ్ సిరప్ను సేవించిన తర్వాత అనేక మంది చిన్నారులు మృతిచెందారని ఆరోపణలు ఉన్నాయి.సిరప్లో అనుమానిత కాలుష్యం ఉందని డ్రగ్స్ కంట్రోల్ బోర్డు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇది డ్రగ్స్ తయారీ కంపెనీల్లో లోపాలను ఎత్తిచూపుతోంది.
నాసిరకం దగ్గు సిరప్ల పంపిణీ, నియంత్రణ వైఫల్యాలను కనిపెట్టేందుకు జాతీయ న్యాయ కమిషన్ లేదా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించాలని న్యాయవాది తివారీ వేసిన పిటిషన్లో సుప్రీంకోర్టును కోరారు. ఈ కమిషన్ కు రిటైర్డ్ సుప్రీంకోర్టు జస్టిస్ నేతృత్వంలో ఫార్మకాలజీ, టాక్సికాలజీ ,ఔషధ నియంత్రణ అధికారులతో చే విచారణ జరిపించాలని కోరారు.