మూత్రంలో రక్తం కనిపిస్తోందా ? అస్సలు లైట్ తీసుకోవద్దు.. డాక్టర్లు ఏమంటున్నారంటే..

మూత్రంలో రక్తం కనిపిస్తోందా ? అస్సలు లైట్ తీసుకోవద్దు.. డాక్టర్లు ఏమంటున్నారంటే..

చాలామంది మూత్రంలో ఒకోసారి రక్తం పడటాన్ని పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా నొప్పి లేకపోతే అస్సలు కేర్ చేయరు. డీహైడ్రేషన్ (ఒంట్లో నీరు తగ్గడం), ఇన్ఫెక్షన్ లేదా కిడ్నీలో రాళ్లు ఉండి ఉంటాయని సరిపెట్టుకుంటారు. కానీ, నొప్పి లేకుండా ఒక్కసారి మూత్రంలో రక్తం కనిపించినా అది కిడ్నీ క్యాన్సర్‌కు తొలి సంకేతం కావచ్చని చెన్నై ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీకి చెందిన ప్రముఖ యూరాలజిస్ట్  హెచ్చరిస్తున్నారు.

కిడ్నీ క్యాన్సర్ అనేది మొదట్లో ఎలాంటి లక్షణాలు చూపించకుండా సైలెంట్‌గా పెరుగుతుంది. అందుకే దీన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. రోగాన్ని ముందే గుర్తిస్తే త్వరగా నయం చేయవచ్చు.

ఎందుకు అప్రమత్తంగా ఉండాలి 
వైద్య భాషలో మూత్రంలో రక్తం పడటాన్ని 'హెమటూరియా' అంటారు. మూత్రం గులాబీ, ఎరుపు లేదా కోకాకోలా రంగులో రావచ్చు. ఒక్కోసారి కంటికి కనిపించకపోయినా యూరిన్ టెస్ట్ చేసినప్పుడు రక్తం ఉన్నట్లు బయటపడుతుంది.

నొప్పి ఉన్నా లేకపోయినా, ఒక్కసారి రక్తం పడినా సరే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఎందుకంటే కిడ్నీ క్యాన్సర్ ముదిరితే తప్ప నడుము నొప్పి, పొత్తికడుపులో గడ్డ, బరువు తగ్గిపోవడం, విపరీతమైన అలసట వంటి లక్షణాలు బయటపడవు. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోవచ్చు.

రక్తం పడితే క్యాన్సరేనా 
మూత్రంలో రక్తం పడిన ప్రతిసారీ అది క్యాన్సర్ కాకపోవచ్చు. యూరిన్ ఇన్ఫెక్షన్లు, కిడ్నీలో రాళ్లు, ప్రోస్టేట్ గ్రంథి వాపు లేదా ఇతర కిడ్నీ సమస్యల వల్ల కూడా రక్తం రావచ్చు. కాబట్టి కంగారు పడకుండా యూరాలజిస్ట్‌ను కలిసి యూరిన్ టెస్ట్, అల్ట్రాసౌండ్, సిటి స్కాన్  లేదా ఎమ్ఆర్ఐ  వంటి పరీక్షలు చేయించుకుని అసలు కారణం తెలుసుకోవాలి.

ఎవరికి ప్రమాదం
1. 50 ఏళ్లు దాటిన వారికి ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ.. ఒకోసారి యువకులకు కూడా రావచ్చు. పొగతాగే అలవాటు ఉన్నవారికి మాత్రం ముప్పు చాలా ఎక్కువ.

2. ఊబకాయం, బీపీ కంట్రోల్‌లో లేకపోవడం, కిడ్నీ జబ్బులు ఉన్నవారికి, ఇంట్లో ఎవరికైనా కిడ్నీ క్యాన్సర్ చరిత్ర ఉన్నా జాగ్రత్తగా ఉండాలి.

3. బరువు తగ్గించుకోవడం, పొగాకుకు దూరంగా ఉండటం, బీపీని అదుపులో ఉంచుకోవడం, రోజూ వ్యాయామం చేయడం ద్వారా ఈ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

ముందే గుర్తిస్తే ఈజీ 
కిడ్నీ క్యాన్సర్‌ను మొదటి దశలోనే గుర్తిస్తే లాపరోస్కోపిక్ లేదా రోబోటిక్ సర్జరీ ద్వారా తక్కువ కోతతో, త్వరగా నయం చేయవచ్చు. దీనివల్ల నొప్పి తక్కువగా ఉంటుంది, కిడ్నీ పాడవకుండా కాపాడుకోవచ్చు.

మన శరీరం పెద్ద సమస్య రాకముందే చిన్న చిన్న సంకేతాల ద్వారా హెచ్చరిస్తుంది. మూత్రంలో రక్తం రావడం కూడా అలాంటి ఒక హెచ్చరికే. నొప్పి లేదని లైట్ తీసుకోకుండా, వెంటనే డాక్టర్‌ను సంప్రదిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చు.