టాలీవుడ్ డ్యాన్సర్స్ రెండు వర్గాలుగా చీలిపోయారు. రోజురోజుకు వారి మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఒక వర్గం ఉప ఎన్నికలకు పట్టుబడుతుంటే .. మరో వర్గం పూర్తిస్థాయిలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. దీంతో ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ పరస్పరం లేఖలు విడుదల చేసుకున్నారు. జానీ మాస్టర్ వర్గానికి , శేఖర్ మాస్టర్ వర్గానికి కొన్ని రోజులుగా ఈ వివాదం నలుగుతోంది.
ప్రస్తుతం డ్యాన్సర్స్ అసోసియేషన్ కి సుమతల అధ్యక్షురాలిగా ఉన్నారు. మొత్తం 16 మంది ఈసీ మెంబర్స్ తో అసోసియేషన్ కొనసాగుతున్నారు. అయితే జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ ని సుమలత సస్పెండ్ చేశారు. దీంతో సుమలత తీరు నచ్చక మరో 8 మంది సభ్యులు రాజీనామా చేశారు. అయితే మొత్తం కార్యవర్గాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళాలని రాజీనామాలు చేసిన సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
తమతో కనీసం సంప్రదించకుండా ఏకపక్షంగా ఉప ఎన్నికలకు ఎలా వెళ్తారని వారు ప్రశ్నిస్తున్నారు .రాజీనామా చేసిన సభ్యులను కలుపుకొని పోవాలని ఫెడరేషన్ , TFDC ఛైర్మెన్ దిల్ రాజు చెప్పినా ఆమె ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ప్రస్తుత పరిణామాల పై ఫెడరేషన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాము అని డాన్సర్స్ తెలిపారు.
మరో వైపు ఫెడరేషన్ జోక్యాన్ని ఖండిస్తూ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత లేఖ విడుదల చేశారు. జనరల్ బాడీ తీర్మానాలపై ఫెడరేషన్ జ్యోకం కుదరదన్నారు. డ్యాన్సర్స్ అసోసియేషన్ లో ఉప ఎన్నికలకు వెళ్తున్నట్టు ప్రకటించింది. తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ 2025- 2027 కార్యవర్గ ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైనట్లు తెలిపారు.
ఈ నిర్ణయం అసోసియేషన్ బైలాస్ ప్రకారమే తీసుకున్నట్లు వెల్లడించారు. ఉప ఎన్నికలకు నామినేషన్లను జూలై 20న స్వీకరించనున్నట్లు తెలిపారు. జూలై 22 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుందని అసోసియేషన్ తరుపున లేఖలో సుమలత పేర్కొన్నారు... ఎన్నికల నిబంధనల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేస్తున్నారు. మరి ఈ వివాదం ఎంత వరకు దారితీస్తుందో చూడాలి..
