మేడారం హుండీల లెక్కింపు.. రెండు రోజుల్లో రూ.6 కోట్ల 13 లక్షలు

మేడారం హుండీల లెక్కింపు.. రెండు రోజుల్లో రూ.6 కోట్ల 13 లక్షలు
  • రెండో రోజు కరెన్సీ కానుకలు రూ. 2 కోట్ల 98 లక్షలు
  • శుక్రవారం 71 హుండీలు తెరిచిన అధికారులు
  • మొత్తం హుండీలు 535.. ఇప్పటికి లెక్కించినవి 205

వరంగల్‍, వెలుగు: మేడారం మహా జాతర హుండీల లెక్కింపు కొనసాగుతోంది. రెండో రోజైన శుక్రవారం నాటికి ఆదాయం రూ.6 కోట్ల 13 లక్షల 75 వేలకు చేరింది. జాతరలో దేవాదాయశాఖ అధికారులు 535 హుండీలను ఏర్పాటు చేయగా హన్మకొండ టీటీడీ కల్యాణ మండపానికి పూర్తిగా నిండిన 518 బాక్సులు చేరాయి. మిగతావి తిరుగువారం భక్తుల కోసం అక్కడే ఉంచారు. 

గురువారం కౌంటింగ్‍ ప్రక్రియ మొదలవగా మొదటిరోజు 134 హుండీల్లో రూ.3 కోట్ల 15 లక్షల 40 వేలు ఇండియన్‍ కరెన్సీ వచ్చింది. రెండో రోజైన శుక్రవారం మధ్యాహ్నం నాటికి సమ్మక్కతల్లి గద్దె వద్ద ఏర్పాటు చేసిన హుండీల లెక్కింపు పూర్తయ్యింది. తర్వాత సారలమ్మ హుండీలతో కలిపి 71 హుండీలను తెరవగా..రూ.2 కోట్ల 98 లక్షల 35 వేల ఆదాయం వచ్చింది. మొత్తంగా రెండు రోజుల్లో రూ.6 కోట్ల 13 లక్షల 75 వేలు వచ్చిందని, అకౌంట్లో జమ చేశామని ఎండోమెంట్‍ ఆఫీసర్లు పేర్కొన్నారు.