గుడివాడ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కొడాలి నానిపై అరెస్టు వారెంట్ జారీ చేయాలని విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు పోలీసులను ఆదేశించింది. కొడాలి నానిపై జారీ చేసిన అరెస్టు వారెంట్ ఈ ఏడాది జనవరి 5వ తేదీ నుంచి పెండింగ్లో ఉంది. దీనికి సంబంధించిన వాయిదాలకు ఎమ్మెల్యే కొడాలి నాని రాకపోవడంపై విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హాజరైన గవర్నర్పేట సీఐ సురేష్ కుమార్ని కోర్టు ప్రశ్నించింది. అనంతరం నానిపై అరెస్టు వారెంట్ పెండింగ్లో ఉందని, దాన్ని వెంటనే అమలు చేయాలని సీఐని ఆదేశించింది.
అప్పటి టీడీపీ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడానికి ప్రయత్నించడం లేదంటూ ఎమ్మెల్యే కొడాలి నాని ఆందోళనలు చేశారు. పోలీసు ఉత్తర్వులు ఉల్లంఘించి 2016 మే 10న మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే కొడాలి నాని, మరికొందరు నాయకులు ర్యాలీ చేపట్టారు. ట్రాఫిక్కు అంతరాయం కలిగించారనే కారణంగా వారిపై కేసులు నమోదయ్యాయి. తాజాగా ఈ కేసులో కొడాలి నాని కోర్టుకు హాజరుకాకపోవడంతో న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ చేసింది.