
హైదరాబాద్: దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో కరోనా ప్రభావం తక్కువగా ఉందన్నారు సీపీ అంజనీ కుమార్. కరోనా ని జయించి తిరిగి విధుల్లో చేరుతున్న పోలీసులను సీపీ శుక్రవారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాక్డౌన్, కరోనా నియంత్రణ ప్రదేశాలు, వలస కూలీల తరలింపులో పోలీసులు ఎంతో కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో పోలీసుశాఖ పాత్ర చిరస్మరణీయమని అన్నారు. పోలీసులు తొందరగా కరోనా నుంచి కోలుకుని తిరిగి విధుల్లో చేరడం సమాజానికే ఆదర్శమని అన్నారు. కోలుకున్న వాళ్ళు ఇతరులకు కరోనా గురించి అవగాహన కల్పించి, ధైర్యం చెప్పాలని సూచించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్లకే కరోనా వల్ల సమస్యలొస్తాయని.. వాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలని సీపీ సూచించారు.