హైదరాబాద్: హైదరాబాద్ సిటీలో కలకలం రేపిన చాదర్ ఘాట్ కాల్పుల ఘటనపై సీపీ సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు. శనివారం (అక్టోబర్ 25) రాత్రి చాదర్ ఘాట్లో ఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం సీపీ మీడియాతో మాట్లాడారు. సెల్ ఫోన్ చోరీకి యత్నించిన దొంగలను పోలీసులు పట్టుకోబోయారని.. ఈ క్రమంలో దొంగలు పోలీసులపై తిరగబడ్డారని తెలిపారు.
దొంగ కత్తితో పొడవడంతో డీసీపీ చైతన్య గన్ మెన్కు గాయాలు అయ్యానని.. దీంతో పరిస్థితి చేయిదాటకుండా డీసీపీ చైతన్య వెంటనే అప్రమత్తమై తుపాకీతో రెండు రౌండ్ల కాల్పులు జరిపాడని వివరించారు. ఇద్దరు దొంగల్లో ఒకరు పారిపోగా.. మరో దొంగ కాల్పుల్లో గాయపడ్డాడని తెలిపారు. గాయపడిన దొంగను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని.. డీసీపీ చైతన్య సేఫ్గా ఉన్నారని వెల్లడించారు.
పట్టుబడిన దొంగను కాలాపత్తర్కు చెందిన రౌడీషీటర్ ఉమర్గా గుర్తించామని ఆయన తెలిపారు. ఉమర్పై గతంలో కూడా చాలా కేసులు ఉన్నాయని.. హైదరాబాద్ పోలీసుల మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ లిస్టులో ఉమర్ ఉన్నాడన్నారు. పరారీలో ఉన్న మరో నేరస్తుడి కోసం గాలిస్తున్నామని చెప్పారు.
►ALSO READ | హైదరాబాద్ లో పోలీస్ కాల్పులు : దొంగలపై DCP చైతన్య ఓపెన్ ఫైర్
కాగా, హైదరాబాద్ చాదర్ ఘట్లోని విక్టోరియా గ్రౌండ్లో కాల్పులు కలకలం సృష్టించాయి. తనపై కత్తితో దాడికి యత్నించిన సెల్ ఫోన్ దొంగలపై సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరికి గాయాలవ్వగా నాంపల్లి ఆస్పత్రికి తరలించారు.
అసలేం జరిగిందంటే..?
సెల్ ఫోన్ స్నాచింగ్ చేస్తున్న దొంగలను పట్టుకోవడానికి ప్రయత్నించారు డీసీపీ చైతన్య. ఈ క్రమంలో డీసీపీ చైతన్య మీద కత్తితో దాడికి యత్నంచారు దొంగలు. దీంతో స్వయంగా డీసీపీ చైతన్య దొంగలపై కాల్పులు జరిపారు. ఇద్దరి మధ్య జరిగిన తోపులాటలో డీసీపీ చైతన్య గన్ మెన్ కింద పడిపోయారు. దీంతో గన్ మెన్ వెపన్ తీసుకొని దొంగపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు డీసీపీ.
ఈ ఘటనలో ఇద్దరు దొంగల్లో ఒకరికి గాయాలవ్వగా వెంటనే.. నాంపల్లి ఆస్పత్రికి తరలించారు. దొంగకు ఛాతికి, మెడకు గాయాలైనట్టు తెలుస్తోంది. డీసీపీ చైతన్య గన్ మెన్ కాలికి స్వల్పంగా గాయాలయ్యాయి. డీసీపీతో పాటు మిగతా పోలీస్ సిబ్బంది క్షేమంగా ఉన్నారు. దొంగ పాత నేరస్థుడేనని..అతనిపై కేసులున్నట్లు పోలీసులు తెలిపారు.
