హైదరాబాద్ చాదర్ ఘట్ లోని విక్టరీయా గ్రౌండ్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. తనపై కత్తితో దాడికి యత్నించిన సెల్ ఫోన్ దొంగలపై సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరికి గాయాలవ్వగా నాంపల్లి ఆస్పత్రికి తరలించారు.
అసలేం జరిగిందంటే..సెల్ ఫోన్ స్నాచింగ్ చేస్తున్న దొంగలను పట్టుకోవడానికి ప్రయత్నించారు డీసీపీ చైతన్య. ఈ క్రమంలో డీసీపీ చైతన్య మీద కత్తితో దాడికి యత్నంచారు దొంగలు. దీంతో స్వయంగా డీసీపీ చైతన్య దొంగలపై కాల్పులు జరిపారు. ఇద్దరి మధ్య జరిగిన తోపులాటలో డీసీపీ చైతన్య గన్ మెన్ కింద పడిపోయారు. దీంతో గన్ మెన్ వెపన్ తీసుకొని దొంగపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు డీసీపీ.
ఈ ఘటనలో ఇద్దరు దొంగల్లో ఒకరికి గాయాలవ్వగా వెంటనే.. నాంపల్లి ఆస్పత్రికి తరలించారు. దొంగకు ఛాతికి, మెడకు గాయాలైనట్టు తెలుస్తోంది. డీసీపీ చైతన్య గన్ మెన్ కాలికి స్వల్పంగా గాయాలయ్యాయి. డీసీపీతో పాటు మిగతా పోలీస్ సిబ్బంది క్షేమంగా ఉన్నారు. దొంగ పాత నేరస్థుడేనని..అతనిపై కేసులున్నట్లు పోలీసులు తెలిపారు.
