
- సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించాలి: కూనంనేని
హైదరాబాద్, వెలుగు: చత్తీస్గఢ్లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతోపాటు పలువురు మావోయిస్టుల ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కేంద్రం ముందుకు రాకపోతే సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించి న్యాయ విచారణకు ఆదేశించాలని గురువారం ఆయన ఒక ప్రకటనలో కోరారు. నంబాల ఎన్ కౌంటర్ పై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని, ఈ వయసులో ఆయన అడవిలో ఉన్నారా? లేదంటే తీసుకెళ్లి అక్కడ మట్టుపెట్టారా? అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. కొంతకాలంగా జరుగుతున్న మావోయిస్టులు, ఆదివాసీల ఎన్ కౌంటర్లు, ఆపరేషన్ కగార్ మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు జరిగిన ఘటనలను విచారణ కింద చేర్చాలన్నారు.