
గద్వాల, వెలుగు: భారత విదేశాంగ విధానంలో అమెరికా పెత్తనం ఏమిటని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ప్రశ్నించారు. సోమవారం గద్వాలలో పార్టీ సమావేశానికి హాజరై మాట్లాడారు. భారత్, పాక్ మధ్య తన చొరవతో యుద్ధం ఆగిందన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భారతదేశ విదేశాంగ శాఖపై అమెరికా పెత్తనాన్ని సహించేది లేదన్నారు. జపాన్ దేశాన్ని వెనక్కి నెట్టి ప్రపంచంలో నాలుగవ ఆర్థిక వ్యవస్థగా దేశం అవతరించిందని గొప్పలు చెబుతున్న మోదీ, దేశంలో పెరుగుతున్న ఆర్థిక, సామాజిక అంతరాలకు గల కారణాలు చెప్పాలన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన 11 ఏండ్లలో అట్టడుగు కులాలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగాయని చెప్పారు.
ప్రజల మధ్య విద్వేషాలు నింపి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య శక్తుల బలోపేతంతోనే విద్వేష రాజకీయాలకు చరమగీతం పాడగలమని తెలిపారు. కార్మిక సమస్యల పరిష్కారం కోసం ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గద్వాల జిల్లాలో పరోక్షంగా, ప్రత్యక్షంగా పేదలపై పెత్తనం చెలాయిస్తున్న అగ్రకుల రాజకీయాలకు వ్యతిరేకంగా అట్టడుగు కులాలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు రాజు, రాష్ట్ర కమిటీ సభ్యుడు శ్రీరాం నాయక్, జిల్లా కార్యదర్శి వెంకటస్వామి, రేపల్లె దేవదాసు, పరంజ్యోతి, నరసింహ పాల్గొన్నారు. అనంతరం ఇథనాల్ ఫ్యాక్టరీ వద్ద జరిగిన గొడవలో కేసుల పాలైన రైతులను పరామర్శించేందుకు పెద్ద ధన్వాడ గ్రామానికి వెళ్లేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను అదుపులోకి తీసుకొని టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.