
న్యూఢిల్లీ, వెలుగు: రాజకీయ లబ్ధి కోసమే మునుగోడు ఉప ఎన్నికకు బీజేపీ తెరలేపిందని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో సోమవారం నల్గొండ మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి, సీపీఎం నాయకులు వెంకటరెడ్డి, జగదీశ్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఉనికే లేని ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లోకి ప్రవేశించాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు జూలకంటి తెలిపారు. మునుగోడు అభివృద్ధి కోసమే రాజీనామా చేసి ఉంటే రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలన్నారు. లేకుంటే ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.