హిందూ దేవత‌ల‌పై స్పీక‌ర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. స‌మ‌ర్థించిన సీపీఎం పార్టీ

హిందూ దేవత‌ల‌పై స్పీక‌ర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. స‌మ‌ర్థించిన సీపీఎం పార్టీ

తిరువ‌నంత‌పురం : హిందువుల దేవుడైన గ‌ణేశుడిపై కేర‌ళ స్పీక‌ర్ ఏఎన్ షంషీర్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతున్న వేళ సీపీఎం పార్టీ స్పందించింది. గణేశుడిపై వివాదాస్పద‌ కామెంట్స్ చేసిన స్పీక‌ర్ షంషీర్ క్షమాప‌ణ‌లు చెప్పడం లేద‌న్నారు కేరళ సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యద‌ర్శి ఎంవీ గోవింద‌న్. స్పీక‌ర్ షంషీర్ చెప్పింది పూర్తిగా నిజ‌మ‌ని వ్యాఖ్యానించారు. బీజేపీతో పాటు రైట్ వింగ్ సంస్థలైన విశ్వహిందూ ప‌రిష‌త్‌.. స్పీక‌ర్ షంషీర్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేప‌ట్టిందని ఆరోపించారు. 

కేరళ స్పీకర్ ఏఎన్ షంషీర్.. ఎర్నాకుళం జిల్లాలో జ‌రిగిన ఓ స్కూల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన గణేశుడిపై వివాదాస్పద కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. సైన్స్ అండ్ టెక్నాల‌జీకి బ‌దులుగా హిందూ మ‌త విశ్వాసాల‌ను పిల్లల‌పై కేంద్ర ప్రభుత్వం రుద్దుతోందని ఆరోపించారు. గ‌ణేశుడు కేవ‌లం క‌ల్పన మాత్రమే అని, ఎటువంటి సైంటిఫిక్ ఆధారాలు లేవ‌ని వ్యాఖ్యానించారు. స్పీకర్ వ్యాఖ్యలపై కేర‌ళ‌ రాష్ర్టంలో దుమారం రేగుతోంది. 

మరోవైపు.. రాష్ర్టంలో జరుగుతున్న ఆందోళనలపై స్పీకర్ స్పందించారు. తాను ఎవరి మనోభావాలు దెబ్బతినాలని వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు. తనకు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు జరగడం దురదృష్టకరమన్నారు.