స్నేహం పేరుతో కేసీఆర్​ మమ్మల్ని మోసం చేసిండు

స్నేహం పేరుతో కేసీఆర్​ మమ్మల్ని మోసం చేసిండు
  • బీజేపీతో లోపాయికారం ఒప్పందం చేసుకున్నడు
  • సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
  • సాయుధ పోరాటం స్ఫూర్తితో మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపు
  • పార్టీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాలు

పాలకుర్తి, వెలుగు: స్నేహం పేరుతో కమ్యూనిస్టులను సీఎం కేసీఆర్​ మోసం చేశారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తమతో స్నేహం కొనసాగిస్తానని మాట ఇచ్చి బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 38వ వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఐలమ్మ కాంస్య విగ్రహానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండీ అబ్బాస్, జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డితో కలిసి తమ్మినేని నివాళులర్పించారు.

అనంతరం సీపీఎం మండల కార్యదర్శి మాచర్ల సారయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పాలకుర్తి కేంద్ర బిందువు అని, పేదలకు ఎర్రజెండా అండగా ఉందన్నారు. విసునూర్  దేశ్​ముఖ్​ వంటి గూండాల నుంచి ఐలమ్మ పంటను ఎర్రజెండా కాపాడిందన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం తాము పోరాటం చేస్తే, నేటి అధికార పార్టీ పాలకులు వందల ఎకరాల భూములను కాజేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో మరో భూపోరాటానికి  ప్రజలు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీతో పాటు ఆ పార్టీతో స్నేహంచేసే పార్టీలను ఓడించడమే తమ లక్ష్యమన్నారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని కేంద్రం వక్రీకరిస్తున్నదని, ఆ పోరాటం హిందూ ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని అన్నారు. బీజేపీ, దాని మిత్రపక్షాలను ఓడించేందుకు ఇండియా కూటమిని ఏర్పాటు చేశామన్నారు. మాజీ సీఎం చంద్రబాబు అరెస్టును ఆయన ఖండించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఆయనను అరెస్టు చేయడం అప్రజాస్వామికం అని విమర్శించారు. అంతకుముందు సీపీఎం కార్యకర్తలు ఎర్రజెండాలతో భారీ బైక్  ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు, ఇర్రి అహల్య, సింగారపు రమేశ్, చందు నాయక్, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.=