ఒమిక్రాన్‌‌‌‌ భయంతో క్రిప్టోలకు క్రాష్‌ కాలం

ఒమిక్రాన్‌‌‌‌ భయంతో క్రిప్టోలకు క్రాష్‌ కాలం
  • క్రిప్టోలకు క్రాష్‌ కాలం 
  • శనివారం ఒక్క రోజే  రూ.7.5 లక్షలు డౌన్‌‌‌‌
  • ఇతర క్రిప్టోలూ అదే బాట
  • దేశంలో క్రిప్టో బ్యాన్ వార్తలు, ఒమిక్రాన్‌‌‌‌ భయాలతో నష్టాల్లోకి..

బిజినెస్‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌, వెలుగు: దేశంలో ప్రైవేట్ క్రిప్టోలను బ్యాన్ చేయడానికి ప్రభుత్వం రెడీ అవుతుండడంతో క్రిప్టో కరెన్సీలు భారీగా పతనమవుతున్నాయి. శనివారం ఒక్క రోజే బిట్‌కాయిన్‌తో సహా అనేక క్రిప్టోలు 20 శాతం మేర నష్టపోయాయి. బిట్‌కాయిన్ తన ఆల్‌టైమ్ హై నుంచి 40 శాతం మేర తగ్గింది. బ్యాన్‌కు కొత్త బిల్లును తెస్తున్నారనే వార్తలు వచ్చినప్పటి నుంచి  క్రిప్టో ఇండస్ట్రీలో పతనం స్టార్టయ్యింది. గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా చూస్తే ఎక్కువ మంది క్రిప్టో ఇన్వెస్టర్లు ఇండియాలోనే ఉన్నారు. ఇక్కడ క్రిప్టోలను బ్యాన్ చేస్తే మాత్రం అది మొత్తం క్రిప్టో ఇండస్ట్రీపై నెగెటివ్ ప్రభావం చూపుతుంది. చైనా బ్యాన్ చేసినప్పుడు కూడా క్రిప్టోలు ఇంతలా నష్టపోవడం చూడలేదు. దీనికి తోడు కరోనా ఒమిక్రాన్ భయాలు కూడా ఈ పతనానికి ఆజ్యం పోస్తున్నాయి.  అంతేకాకుండా అనుకున్న టైమ్‌‌‌‌‌‌‌‌ కంటే రెండు నెలల ముందే  బాండ్ల కొనుగోళ్లను ఆపేస్తామని, వడ్డీ రేట్లను కూడా పెంచుతామనే సంకేతాలను యూఎస్‌‌‌‌‌‌‌‌ ఫెడ్ చైర్మన్ జెరోమ్‌‌‌‌‌‌‌‌ పావెల్ ఇచ్చారు. సెంట్రల్ బ్యాంకులు తమ బాండ్‌‌‌‌‌‌‌‌ కొనుగోళ్లను తగ్గించేస్తే వ్యవస్థలో లిక్విడిటీ తగ్గుతుంది. దీంతో షేర్లు, క్రిప్టోలు వంటి రిస్క్ ఎక్కువగా ఉన్న అసెట్లలో ఇన్వెస్ట్ చేయడానికి  ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించడం తగ్గుతుంది. ఈ భయాలతో  ఇన్వెస్టర్లు తమ దగ్గరున్న క్రిప్టోలను అమ్మేస్తున్నారు. 

క్రిప్టో మార్కెట్ క్యాప్ రూ. 41 లక్షల కోట్లు డౌన్‌‌‌‌‌‌‌‌ 
అతిపెద్ద క్రిప్టో కరెన్సీ అయిన బిట్‌‌‌‌‌‌‌‌కాయిన్ శనివారం 10 వేల డాలర్లు (రూ. 75 లక్షలు) తగ్గి ఇంట్రాడేలో 42 వేల డాలర్ల (రూ. 31.5 లక్షల) కు పడిపోయింది. తర్వాత బయ్యింగ్ రావడంతో కొద్దిగా పెరిగి  46,56‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌0 డాలర్ల (రూ. 35 లక్షల) వద్ద ట్రేడవుతోంది. రెండో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎథరమ్‌‌‌‌‌‌‌‌ కూడా 15 శాతానికి పైగా నష్టపోయి 3,890 డాలర్ల (రూ. 2.9 లక్షల) వద్ద ట్రేడవుతోంది.  డోజ్‌‌‌‌‌‌‌‌కాయిన్‌‌‌‌‌‌‌‌, షిబా ఇను, లైట్‌‌‌‌‌‌‌‌కాయిన్‌‌‌‌‌‌‌‌, ఎక్స్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీ, పోల్కడాట్‌‌‌‌‌‌‌‌, యూనిస్వాప్‌‌‌‌‌‌‌‌, స్టెల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి క్రిప్టో కరెన్సీలు కూడా గత 24 గంటల్లో 13–20 శాతం మేర  లాస్ అయ్యాయి. బిట్‌‌‌‌‌‌‌‌కాయిన్ తన ఆల్‌‌‌‌‌‌‌‌టైమ్ హై అయిన 69 వేల డాలర్ల (రూ.51.75 లక్షల)  నుంచి రూ. 16.83 లక్షలు నష్టపోయి ప్రస్తుతం ట్రేడవుతోంది. కాయిన్‌‌‌‌‌‌‌‌ గ్లాస్ డాట్‌‌‌‌‌‌‌‌ కామ్‌‌‌‌‌‌‌‌ డేటా ప్రకారం,  మొత్తం క్రిప్టో ఇండస్ట్రీ మార్కెట్‌‌‌‌‌‌‌‌ క్యాప్‌‌‌‌‌‌‌‌ కేవలం  24 గంటల్లోనే రూ. 41,25,00 కోట్లు తగ్గింది.   ఈ మార్కెట్ క్యాప్ 2.3 లక్షల కోట్ల డాలర్లు (రూ. 172.5 లక్షల కోట్లు) గా ఉంది.

క్రిప్టో కరెన్సీలను ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌గా చూడొద్దు.. 
క్రిప్టో కరెన్సీలను ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌గా చూడొద్దని  సీనియర్ ఇన్వెస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్క్‌‌‌‌‌‌‌‌మొబియస్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నారు.  ‘ఇన్వెస్టర్లు గోల్డ్‌‌‌‌‌‌‌‌ను కొనుక్కోవచ్చు. ఎమెర్జెన్సీ కోసం పోర్టుఫోలియోలో 10 శాతం ఈ అసెట్‌‌‌‌‌‌‌‌ కోసం కేటాయించొచ్చు. బిట్‌‌‌‌‌‌‌‌కాయిన్‌‌‌‌‌‌‌‌ లేదా క్రిప్టో కరెన్సీలు  ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లు కావు.  వీటి రేట్లు పెరుగుతాయనే ఆలోచన నీతో పాటు అవతలి వాళ్లకి ఉంటేనే వీటికి వాల్యూ. ఇవి ఎటువంటి డబ్బును సంపాదించలేవు. డివిడెండ్‌‌‌‌‌‌‌‌లు ఇవ్వవు. దేన్ని కూడా ప్రొడ్యూస్ చేయలేవు. క్రిప్టోలను ఏ ఇండస్ట్రీయల్ అవసరాలకు వాడలేము. వీటి కదలికలతో ఆడుకోవచ్చు. ఫన్ చేయొచ్చు. కానీ, వీటిని  ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌గా చూడొద్దు’ అని మార్క్ అన్నారు.

క్రిప్టోలపై ప్రభుత్వం క్లియర్‌‌‌‌‌‌‌‌? 
దేశంలో  క్రిప్టో ఇండస్ట్రీపై ప్రభుత్వం క్లియర్‌‌‌‌‌‌‌‌గా ఉన్నట్టు కనిపిస్తోంది. టాప్ అధికారులు క్రిప్టోలపై నెగెటివ్‌‌‌‌గానే ప్రకటనలు చేస్తున్నారు.  క్రిప్టో సెగ్మెంట్‌‌‌‌కు సంబంధించి ఎటువంటి అడ్డు అదుపులేని స్పెక్యులేషన్స్‌‌‌‌ మంచివి కావని శనివారం జరిగిన హిందుస్తాన్ టైమ్స్ లీడర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌ సమ్మిట్‌‌‌‌లో ఫైనాన్స్‌‌‌‌ మినిస్టర్ నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అందరి సలహాలు తీసుకున్నాకనే క్రిప్టో కరెన్సీ బిల్లు తీసుకొస్తామని చెప్పారు. అంతకుముందు  క్రిప్టో వంటి టెక్నాలజీలను  రెగ్యులేట్ చేయడం కుదరదని, ఎందుకంటే ఈ టెక్నాలజీలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయని   ఆమె పేర్కొనడం  గమనించాలి. ఇటువంటి టెక్నాలజీలను  కంట్రోల్ చేయాలంటే గ్లోబల్‌‌‌‌గా అన్ని దేశాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు కూడా. కిందటి నెల 29 న  బిట్‌‌‌‌కాయిన్‌‌‌‌ను కరెన్సీగా గుర్తించే ఆలోచన లేదని పార్లమెంట్‌‌‌‌లో సీతారామన్ ప్రకటించారు. బిట్‌‌‌‌కాయిన్ ట్రాన్సాక్షన్ల డేటా  సేకరించడం లేదని అప్పుడు చెప్పారు. మాక్రో ఎకానమీకి క్రిప్టో కరెన్సీలు మంచిది కాదని ప్రభుత్వానికి సలహా యిచ్చామని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్‌‌‌‌ పదే పదే చెబుతూనే ఉన్నారు. ప్రభుత్వం క్రిప్టోలను బ్యాన్ చేయడానికే మొగ్గు చూపుతోందని ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. కానీ, ఈ ఇండస్ట్రీ తలుపులు పూర్తిగా మూసేయడం కంటే  క్రిప్టో ట్రాన్సాక్షన్లు, పేమెంట్లను బ్యాన్ చేసి,  షేర్లు, బాండ్లు, గోల్డ్‌‌‌‌ వంటి అసెట్లలా వీటిని దాచుకోవడానికి అవకాశం కలిపించొచ్చని అభిప్రాయపడుతున్నారు. క్రిప్టో ఇండస్ట్రీని సెబీ కంట్రోల్‌‌‌‌కి తెచ్చి, వీటిపై ట్యాక్స్‌‌‌‌లు విధిస్తారనే అంచనాలూ లేకపోలేదు.