సినిమా ఇండస్ట్రీలో హిట్ కాంబినేషన్స్ను రిపీట్ చేయడం కామన్. తాజాగా మరో హిట్ కాంబోపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో ఆరేళ్ల క్రితం వచ్చిన ‘రంగస్థలం’ సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో మరో మూవీ రాబోతోందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుండగా, ఈ క్రేజీ ప్రాజెక్టును నిజం చేస్తూ సోమవారం హోలీ సందర్భంగా అధికారికంగా ప్రకటించారు. చరణ్, సుకుమార్ ఇద్దరూ వైట్ అండ్ వైట్ డ్రెస్లో కనిపిస్తూ, హోలీ వేడుకను జరుపుకున్న ఫొటోను షేర్ చేశారు.
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. రామ్ చరణ్ కెరీర్లో ఇది 17వ సినిమా. ‘రంగస్థలం’ విలేజ్ బ్యాక్డ్రాప్లో రాగా, ఇప్పుడు తెరకెక్కించబోయే సినిమా అల్ట్రా స్టైలిష్గా రూపొందించనున్నట్టు తెలుస్తోంది. దీనికోసం ఇప్పటికే సుకుమార్ స్ర్కిప్ట్ను కూడా సిద్ధం చేశారట. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. ఈ ఏడాదిలోనే షూటింగ్ మొదలు పెట్టి.. వచ్చే సంవత్సరం చివర్లో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.