ODI World Cup 2023: దయచేసి ఫైనల్ చూడకండి.. బిగ్ బీని కోరుతున్న అభిమానులు

ODI World Cup 2023: దయచేసి ఫైనల్ చూడకండి.. బిగ్ బీని కోరుతున్న అభిమానులు

మూడోసారి విశ్వవిజేతగా నిలవడానికి భారత జట్టు మరో అడుగు దూరంలో ఉంది. ఆదివారం(నవంబర్ 19న)అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాను ఓడిస్తే ఆ కలను సాకారం చేసుకోవచ్చు. ఇలాంటి సమయాన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌‌ను భారత క్రికెట్ అభిమానులు ఓ వింత కోరిక కోరుతున్నారు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూడొద్దని బిగ్ బీకి సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు. అభిమానుల ఈ వింత కోరిక వెనుక ఓ బలమైన కారణమే ఉంది. 

బుధవారం వాంఖడే వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ పోరులో భారత జట్టు విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. హోరాహోరీగా సాగిన ఈ ఉత్కంఠభరిత పోరులో టీమిండియా 70 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం రాత్రి 10:30 గంటల సమయంలో అమితాబ్ ఓ ట్వీట్ చేశారు. తాను మ్యాచ్ చూడనందుకు భారత్ మ్యాచ్ గెలిచిందనేది ఆ ట్వీట్ సారాంశం. 

 "నేను చూడని సమయంలోనే మనం గెలుస్తాం" అని అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు. అంటే బిగ్ బీ ఫైనల్ కూడా చూడకపోతే మనం విజయం సాధిస్తామనేది అభిమానుల వాదన. అందువల్లే ఫైనల్ చూడొద్దని అభిమానులు అతన్ని కోరుతున్నారు.

గోల్డెన్ టికెట్

వరల్డ్ కప్ 2023 టోర్నీ ప్రారంభానికి ముందు బీసీసీఐ.. అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్, రజనీకాంత్‌లకు గోల్డెన్ టికెట్ అందించింది. అంటే వీరు వరల్డ్ కప్‌లో ఏ మ్యాచ్ అయినా ఉచితంగా చూడవచ్చన్నమాట. ఈ  లెక్కన బిగ్ బీ అభిమానుల కోరిక మేరకు టీవీలో మ్యాచ్ చూడటం మానేసి స్టేడియంలో ప్రత్యక్షమవుతారేమో చూడాలి.