కేటీఆర్​పై క్రిమినల్​ కేసు

కేటీఆర్​పై క్రిమినల్​ కేసు

పంజాగుట్ట, వెలుగు: కాంట్రాక్టర్లు, బిల్డర్ల వద్ద నుంచి సీఎం రేవంత్  రెడ్డి రూ.2,500 కోట్లు వసూలు చేసి ఢిల్లీకి పంపారని బీఆర్ఎస్​ వర్కింగ్  ప్రెసిడెంట్​ కేటీఆర్  చేసిన ఆరోపణలపై హనుమకొండకు చెందిన ప్రదేశ్ ​కాంగ్రెస్​ కమిటీ సభ్యుడు బత్తిన శ్రీనివాసరావు అక్కడి పోలీసులకు ఈ నెల 28న ఫిర్యాదు చేశారు. కేటీఆర్  చేసిన ఆరోపణలతో సీఎం పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లుతుందని, కేటీఆర్​పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా ఎంపీ ఎన్నికల తర్వాత సీఎం బీజేపీలో చేరతారని సీఎం స్థాయిని తగ్గించే విధంగా కేటీఆర్ ​మాట్లాడారన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా, పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని తెలిపారు. ఆయన ఫిర్యాదుతో హనుమకొండ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్​ నమోదు చేసి బంజారాహిల్స్​ పోలీసులకు ట్రాన్స్​ఫర్  చేశారు. ఈ మేరకు కేటీఆర్​పై శుక్రవారం ఐపీసీ 504,505(2) సెక్షన్ల కింద బంజారా హిల్స్  పోలీసులు క్రిమినల్​ కేసులు నమోదు చేశారు.

యూట్యూబ్​ చానళ్లకు కేటీఆర్ నోటీసులు

హైదరాబాద్, వెలుగు: మీడియా ముసుగులో కొన్ని సంస్థలు తనపై, తన ఫ్యామిలీపై అసత్య ప్రచారాలు, కట్టు కథలను ప్రచారం చేస్తున్నాయని కేటీఆర్​అన్నారు. సంబంధం లేని అంశాల్లో తమ పేరు, ఫొటోలను వాడుతూ థంబ్​ నెయిల్స్​ పెడుతున్నారన్నారు. దీనిపై కొన్ని సంస్థలకు లీగల్​ నోటీసులు పంపామని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. తమపై ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో  పోస్ట్ చేసిన వీడియోలను వెంటనే తీసేయాలన్నారు. యూట్యూబ్​చానళ్లతో పాటు యూట్యూబ్​ సంస్థకు కూడా  లీగల్​ నోటీసులు పంపించామని కేటీఆర్ పేర్కొన్నారు.