- హరిణి నేషనల్ పార్కులో రిసార్ట్ నిర్వహణ తీరుపై తీవ్ర విమర్శలు
- లైటింగ్, సౌండ్స్తో ఇబ్బందిపడ్తున్న వన్యప్రాణులు
- గత బీఆర్ఎస్ హయాంలో నెలకు రూ.19 వేలకే లీజుకు
- పదేండ్లలో తొమ్మిదేండ్లకు పైసా అద్దె కట్టలే
- ఇటీవల మంత్రి సురేఖ తనిఖీలతో బట్టబయలు
- రిసార్ట్ను స్వాధీనం చేసుకోవాలని టీజీఎఫ్డీసీకి అటవీ శాఖ ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్హయత్నగర్సమీపంలోని ‘మహావీర్ హరిణి వనస్థలి నేషనల్ పార్క్’ లో రిసార్ట్ పేరుతో వాణిజ్య కార్యకలపాలు నిర్వహిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాత్రీపగలు తేడాలేకుండా వస్తున్న సౌండ్, లైటింగ్ పొల్యూషన్తో వన్యప్రాణులు ఇబ్బందిపడ్తున్నా ఫారెస్ట్ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. సుమారు 3,600 నుంచి 3,800 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పార్కు ప్రధానంగా కృష్ణ జింకలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఏకంగా 400 దాకా కృష్ణ జింకలు, 350 కి పైగా మచ్చల జింకలు ఉన్నాయి. ఇవి గాక పెద్దసంఖ్యలో అడవి పందులు, నక్కలు, కుందేళ్లు, పునుగు పిల్లులున్నాయి. నెమళ్లు, బాతులు, కింగ్ఫిషర్లు, తదితర 120 కి పైగా పక్షి జాతులు, వివిధ రకాల సరీసృపాలు కూడా ఇక్కడ నివసిస్తున్నాయి.
ఎఫ్డీసీ ఆధ్వర్యంలో అనన్య ఎకో రిసార్ట్
జింకలతో నిండిన ఈ ఎకో సెన్సిటివ్ జోన్లో ఫారెస్ట్ డెవలప్మెంట్కార్పొరేషన్(ఎఫ్డీసీ) ఆధ్వర్యంలో ‘అనన్య ఎకో రిసార్ట్’ను 7 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. సుమారు 10 కాటేజీలు, హోటల్, రెస్టారెంట్, స్విమ్మింగ్ఫూల్, ఇండోర్, అవుట్డోర్ గేమ్స్, ప్లే ఏరియాతోపాటు 30 నుంచి 2 వేల మందికి సరిపడా బ్యాంక్వెట్ హాల్స్ నిర్మించారు. వీకెండ్లో ఫ్యామిలీస్, ఫ్రెండ్స్తో సరదాగా గడపడానికి, వెడ్డింగ్ ఈవెంట్లు, బర్త్ డే, ఇతర పార్టీలకు వీటిని అద్దెకిస్తున్నారు. గత బీఆర్ఎస్హయాంలో కేవలం నెలకు రూ.19 వేల చొప్పున ఈ రిసార్ట్స్ను ఓ ప్రైవేట్ వ్యక్తికి లీజ్కు ఇచ్చారు.
ఒక్క ఏడాది మాత్రమే లీజ్ చెల్లింపు
అనన్య ఎకో రిసార్ట్ గడిచిన పదేండ్లలో కేవలం ఒక్క ఏడాది మాత్రమే లీజ్చెల్లించింది. విషయం కాస్తా మంత్రి కొండా సురేఖ దృష్టికి రావడంతో ఇటీవల ఆమె ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా, పలు అక్రమాలు బయటపడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ రిసార్ట్ను వ్యాపార కార్యకలాపాలకు వినియోగించడం, రాత్రీపగలు తేడాలేకుండా సౌండ్, లైటింగ్ పొల్యూషన్తో వన్యప్రాణులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు మంత్రి గుర్తించారు.
అటవీ ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు కనీసం మట్టి రోడ్డు వేయాలన్నా, కరెంటు లైన్లాగాలన్నా అటవీశాఖ అధికారులు సవాలక్ష కొర్రీలు పెడుతారు. కానీ వన్యప్రాణులకు ఇంత ఇబ్బంది కలుగుతుందని తెలిసినా కోర్ ఏరియాలో రిసార్ట్స్ నిర్మించి, వ్యాపార కార్యకలాపాలకు వినియోగించడంపై మంత్రి సీరియస్కావడంతో తాజాగా అటవీశాఖ రంగంలోకి దిగింది. ఈ రిసార్ట్ను ప్రైవేట్ వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకోవాలంటూ టీజీఎఫ్డీసీకి తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇప్పటికైనా ఈ వివాదానికి చెక్ పడ్తుందా? లేదా? అనే చర్చ జరుగుతోంది.
