- ఆగమైతున్న పాలమూరు రైతులు
- మిడ్జిల్ మండలానికి అందని ఎంజీకేఎల్ఐ నీళ్లు
- కోయిల్సాగర్ లెఫ్ట్ కెనాల్కూ నీళ్లు ఆపేసిన ఆఫీసర్లు
- భూమి నెర్రలుబారి ఎండిపోతున్న పంటలు
- బోర్లు వేస్తున్నా.. నీళ్లు పడ్తలేవ్
మహబూబ్నగర్/మిడ్జిల్, వెలుగు: మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ఇరిగేషన్(ఎంజీకేఎల్ఐ) -3, కోయిల్సాగర్ సాగునీటి కాల్వలకు ఆఫీసర్లు నీళ్లు బంద్చేశారు. రైతులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ఇవ్వకుండానే నీటి విడుదల ఆపేయడంతో కాలువల పొంటి పంటలేసుకున్నవారు ఆగమవుతున్నారు. మహబూబ్ నగర్జిల్లా మిడ్జిల్మండలంలో సాధారణ సాగు విస్తీర్ణం 10 వేల ఎకరాలు కాగా, ఈ యాసంగిలో 8 వేల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తున్నారు. ఎంజీకేఎల్ఐ -3 కెనాల్ఆధారంగా వాడ్యాల్, మిడ్జిల్, మున్ననూరు, వెలుగోముల, అయ్యవారిపల్లి, కొత్తూరు, గుడిగానిపల్లి, మల్లాపూర్, మాదారం గ్రామాలకు చెందిన రైతులు దాదాపు ఆరు వేల ఎకరాల్లో ప్రధాన పంటగా వరి, పల్లి వేశారు. వరి వేసి నెల రోజులు అవుతోంది. వారం రోజులుగా కెనాల్కు నీళ్లు బంద్ పెట్టడంతో రైతులంతా ఆందోళన చెందుతున్నారు. చాలాచోట్ల నీరందక వరి పైరు ఎండిపోతోంది. కొందరు రైతులు డేర్చేసి బోర్లు వేయిస్తున్నా నీళ్లు పడటం లేదు. పంటల కోసం పెట్టిన పెట్టుబడులతో పాటు బోర్లు వేయించేందుకు వేలల్లో ఖర్చు చేసి అప్పుల పాలవుతున్నారు. పల్లి రైతుల పరిస్థితి కూడా ఇలానే ఉంది. మరో నెల రోజులైతే యాసంగిలో వేసిన పల్లి చేతికి వస్తుంది. ఈ తరుణంలో నీటి విడుదల నిలిపివేయడంతో పంట లాస్అవుతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పది రోజులకు ఒకసారి..
కోయిల్సాగర్ లెఫ్ట్, రైట్ కెనాల్స్ కింద దేవరకద్ర, చిన్నచింతకుంట, నారాయణపేట జిల్లాలోని ధన్వాడ, మరికల్ మండలాల్లో 22 వేల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తున్నారు. ఇక్కడా ప్రధాన పంటలుగా వరి, వేరుశనగ వేశారు. ప్రస్తుతం కోయిల్సాగర్లో 16.8 అడుగుల ఎత్తులో నీరు నిల్వ ఉండగా, పది రోజులకోసారి విడుదల చేయాలని ఇటీవల ఐడీబీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు మూడు రోజుల నుంచి నీళ్లు బంద్పెట్టారు. మరో వారం తర్వాతే రిజర్వాయర్ లెఫ్ట్ కెనాల్కు నీటిని విడుదల చేస్తామని ఆఫీసర్లు చెబుతున్నారు. రైట్ కెనాల్కు రిపేర్ల పేరుతో పూర్తిగా నీటి విడుదల ఆపేశారు. ఈ కెనాల్కింద ఉన్న రైతులు బోర్ల ఆధారంగా పంటలేసుకున్నారు. అయితే యాసంగి పంటలేసే టైం లేట్కావడంతో మార్చి చివరి నుంచి ఏప్రిల్రెండో వారం వరకు వరికి నీటి తడులు అవసరం అవుతాయి. ఇప్పటికే ఎండలు ముదురుతుండటంతో ఏప్రిల్ వరకు గ్రౌండ్ వాటర్ఉండటం కష్టమేనని రైతులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆఫీసర్లు మార్చి చివరి వారం నుంచి ఏప్రిల్వరకు కనీసం మూడు తడులకైనా కుడి కాల్వకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
రూ.5 లక్షలు లాస్
నాకు 12 ఎకరాల పొలముంది. ఎంజీకేఎల్ఐ లిఫ్ట్-3 కాల్వ నుంచి మూడు కిలోమీటర్ల మేర రూ.8 లక్షలు ఖర్చు చేసి పైపులైను వేసిన. 8 ఎకరాల్లో పల్లి, రెండున్నర ఎకరాల్లో వరి, రెండు ఎకరాల్లో బుడమకాయ పంటలేసిన. ఇప్పుడు కాల్వకు నీళ్లు బంద్పెట్టిన్రు. నాకున్న ఒక బోరు నీరు పంటలకు సరిపోవడం లేదు. కాలువ నీళ్లు ఇయ్యకుంటే దాదాపు రూ.5 లక్షల నష్టం వస్తుంది.
–తిరుపతయ్య, రైతు, మిడ్జిల్