- టూరిజం అభివృద్ధిలో సినిమాల పాత్ర కీలకం
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- శ్రీనగర్ వేదికగా జీ20 సమావేశాలు ప్రారంభం
- రామ్ చరణ్, దిల్ రాజు హాజరు
న్యూఢిల్లీ, వెలుగు: పర్యాటక రంగ అభివృద్ధిలో సినిమాల పాత్ర కీలకమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సినిమాల్లో చూపించే ప్రకృతి రమణీయమైన ప్రాంతాలు పర్యాటకులను ఆకర్షిస్తాయని ఆయన పేర్కొన్నారు. కాశ్మీర్ ప్రకృతి అందాలను చూపించే చిత్రాలతో స్థానికంగా పర్యాట కం అభివృద్ధి చెందిన సందర్భాలను ప్రస్తావించారు. కాశ్మీర్లోని శ్రీనగర్లో 2రోజులపాటు జరగనున్న జీ20 సమావేశాలను పురస్కరించుకుని సోమవారం సైడ్ ఈవెంట్గా ‘ఆర్థిక వృద్ధి, సాంస్కృతిక పరిరక్షణలో ఫిల్మ్ టూరిజం’ థీమ్పై చర్చించారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ వివిధ దేశాల్లో పర్యాటక రంగంలో సినిమాల పాత్రకు సంబంధించిన పాలసీలు, ఉత్తమ పద్ధతుల మార్పిడి తదితర అంశాలకు జీ–20 సదస్సు చక్కని వేదిక అని పేర్కొన్నారు. 2ఆస్కార్ అకాడమీ అవార్డులను గెలుచుకున్న సందర్భాన్ని ప్రస్తావించారు. ‘నాటు నాటు’ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా, ‘ది ఎలిఫెంట్ విస్పర్స్’ ఉత్తమ డాక్యుమెంటరీగా నిలిచాయని చెప్పారు.
కార్యక్రమంలో జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, పర్యాటక శాఖ సహాయ మంత్రి అజయ్ భట్, సినీ నటుడు రామ్ చరణ్ తేజ, నిర్మాత దిల్ రాజు, జీ-20 షెర్పా అమితాబ్ కాంత్, జీ20 కోఆర్డినేటర్ హర్షవర్ధన్ శ్రింగ్లా, పర్యాటక శాఖ కార్యదర్శి అరవింద్ సింగ్, జీ20 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, విదేశీ ప్రతినిధులతో కలిసి నాటు నాటు పాటకు రామ్ చరణ్ స్టెప్పులు వేశారు.