క్రిప్టో ఇన్వెస్టర్ల ఫ్యూచరేంటి? బ్యాన్ చేస్తే పరిస్థితేంటి?

క్రిప్టో ఇన్వెస్టర్ల ఫ్యూచరేంటి? బ్యాన్ చేస్తే పరిస్థితేంటి?

బిజినెస్‌‌ డెస్క్‌‌, వెలుగు: దేశంలో ప్రైవేట్‌‌ క్రిప్టో కరెన్సీలను బ్యాన్‌‌ చేయడానికి ప్రభుత్వం రెడీ అవుతుండడంతో ఇండస్ట్రీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అన్ని అంశాలను బేరీజు వేసుకొని ప్రభుత్వం తన చివరి నిర్ణయాన్ని తీసుకోవాలని దేశంలోని క్రిప్టో ఎక్స్చేంజిలు కోరుతున్నాయి. క్రిప్టో ఇన్వెస్టర్లు భయపడొద్దని, అప్పుడే ఒక నిర్ణయానికి రావొద్దని ఇన్వెస్టర్లకు సలహాయిస్తున్నాయి.  దేశంలో క్రిప్టోలపై రెగ్యులేషన్స్  విధిస్తారే తప్ప బ్యాన్ చేయరనే వార్తలు గత కొన్ని నెలలుగా చక్కర్లు కొట్టాయి. దీనికి తోడు  తాజాగా  స్టాండింగ్ కమిటీ కూడా బ్యాన్ కన్నా  నియంత్రించడం బెటర్ అని ప్రభుత్వానికి సలహాయిచ్చింది. ఈ నేపథ్యంలో మరింత మంది ఇన్వెస్టర్లు క్రిప్టోల్లో ఇన్వెస్ట్‌‌ చేశారు. చాలా క్రిప్టో కరెన్సీల రేట్లు భారీగా పెరిగాయి. ప్రస్తుతం మాత్రం పూర్తిగా బ్యాన్ ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. ‘ది క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్‌‌ డిజిటల్ కరెన్సీ బిల్లు, 2021’ ను ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లు ద్వారా డిజిటల్ రూపాయిని తీసుకురావడానికి  ఆర్‌‌‌‌బీఐకి వీలుకలుగుతుంది. ఇదే బిల్లులో బిట్‌‌కాయిన్‌‌, ఎథరమ్, డోజ్‌‌కాయిన్‌‌ వంటి ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను బ్యాన్‌‌ చేసే ప్రపోజల్స్ ఉన్నాయని అంచనా. కానీ, క్రిప్టో కరెన్సీ టెక్నాలజీ ( బ్లాక్‌‌చెయిన్) ని ప్రమోట్ చేసేందుకు కొన్ని మినహాయింపులను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.  క్రిప్టో బ్యాన్‌‌ విధించొద్దని ఇండస్ట్రీ కోరుతోంది.  ఇన్వెస్టర్లు, కంపెనీలు, ఈ ఇండస్ట్రీతో సంబంధం ఉన్నవాళ్లందరూ నష్టపోతారని చెబుతోంది.

ఆందోళనలో క్రిప్టో ఎక్స్చేంజిలు..
 దేశంలో క్రిప్టో ఇన్వెస్టర్లు పెరుగుతుండడంతో గత మూడేళ్లలోనే 10 కి పైగా ఎక్స్చేంజిలు పుట్టుకొచ్చాయి. ప్రస్తుతం ఈ ఎక్స్చేంజిలు కొత్త బిల్లుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశ క్రిప్టో ఇండస్ట్రీపై నమ్మకం ఉంచిన ఇన్వెస్టర్లు, ఎంటర్‌‌‌‌ప్రెనూర్ల ఆశలను పరిగణనలోకి తీసుకొని ఈ కొత్త బిల్లు ఉంటుందని నమ్ముతున్నానని బైయూకాయిన్ సీఈఓ శివమ్‌‌ తక్రాల్‌‌ అన్నారు. బ్లాక్‌‌చెయిన్‌‌ ప్రాజెక్ట్‌‌లకు సపోర్ట్ ఇచ్చేలా ఫ్లెక్సిబుల్‌‌గా క్రిప్టో బిల్లు ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇన్వెస్టర్లను ప్రొటెక్ట్ చేసేందుకు తరచూ ఇండస్ట్రీ వర్గాలతో చర్చలు జరుపుతున్నామని కాయిన్‌‌స్విచ్ కుబేర్‌‌‌‌ సీఈఓ ఆశిష్‌ సింఘల్‌‌ అన్నారు. క్రిప్టో టెక్నాలజీ రివల్యూషన్‌‌ను ఇండియా అడ్వాంటేజ్‌‌గా మార్చుకుంటుందని ఆయన అన్నారు. ‘ప్రస్తుతానికైతే దేశంలోని క్రిప్టో ఇన్వెస్టర్లందరికీ ఒకటే చెబుతున్నా.. ప్రశాంతంగా ఉండండి. ఏదైనా నిర్ణయానికి వచ్చే ముందు సొంతంగా రీసెర్చ్ చేయండి’ అని  సింఘల్ సలహాయిచ్చారు. బ్లాక్‌‌చెయిన్‌‌ అండ్ క్రిప్టో అసెట్స్‌‌ కౌన్సిల్ (బీఏసీసీ) కో– చైర్మన్‌‌గా కూడా ఆయన పనిచేస్తున్నారు. సరియైన రెగ్యులేషన్స్‌‌తోనే క్రిప్టో టెక్నాలజీ వాడకం పెరుగుతుందని కాయిన్‌‌డీసీఎక్స్‌‌ స్పోక్స్‌‌పర్సన్‌‌ పేర్కొన్నారు. గ్లోబల్‌‌గా చూస్తే ఇండియాలోనే ఎక్కువ మంది క్రిప్టో ఇన్వెస్టర్లు ఉన్నారని, వీరిని కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఓకెక్స్‌‌. కామ్‌‌ సీఈఓ జే హావో పేర్కొన్నారు. క్రిప్టో కరెన్సీ బిల్లు పాజిటివ్‌‌గా ఉంటే క్రిప్టో, డెఫి, ఎన్‌‌ఎఫ్‌‌టీ వంటి కొత్త తరం టెక్నాలజీలో ఇండియా లీడర్‌‌‌‌గా మారుతుందని అంచనావేశారు. కాగా, కిందటి వారం  బీజేపీ లీడర్‌‌‌‌ జయంత్‌‌ సిన్హా నాయకత్వంలో ఇండస్ట్రీ వర్గాలతో జరిగిన మీటింగ్‌‌లో క్రిప్టోలపై బ్యాన్ విధించడం కంటే రెగ్యులేషన్స్‌‌ పెట్టడం మంచిదనే కన్‌‌క్లూజన్‌‌కు వచ్చారు. మరోవైపు క్రిప్టో కరెన్సీలు మాక్రోఎకానమీకి  మంచిది కాదని ఆర్‌‌‌‌బీఐ ప్రభుత్వానికి సలహాయిచ్చింది.  ఈ 2 నిర్ణయాల్లో దేన్ని ప్రభుత్వం ఫాలో అవుతుందో బిల్లు ప్రవేశపెట్టిన రోజే తెలుస్తుంది. బ్యాన్ వార్తలతో  దేశ క్రిప్టో ఎక్స్చేంజిల్లో  బిట్‌‌కాయిన్, ఎథరమ్‌‌, డోజ్‌‌కాయిన్​లు భారీగా నష్టపోయాయి.  రూపాయి మారకంలో బిట్‌‌కాయిన్ 17%, ఎథరమ్‌‌ 14%, డోజ్‌‌కాయిన్‌‌  20%, పోల్కడాట్‌‌ 14% మేర పడ్డాయి.

6 వేల క్రిప్టోల్లో రెండే మిగులుతయ్‌‌!
ప్రస్తుతం ట్రేడవుతున్న  క్రిప్టో కరెన్సీల్లో మెజార్టీ కరెన్సీలు త్వరలో కనుమరుగవుతాయని ఆర్‌‌‌‌బీఐ మాజీ గవర్నర్‌‌‌‌ రఘురామ్‌‌ రాజన్ అభిప్రాయపడ్డారు. సుమారు 6 వేల క్రిప్టో కరెన్సీలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. కానీ, ఇందులో కేవలం ఒకటో రెండో  కరెన్సీలు మాత్రమే మిగులుతాయని ఆయన అన్నారు.  దేని విలువైనా కేవలం భవిష్యత్‌‌లో పెరుగుతుందనే అంచానలపైనే ఆధారపడి ఉంటే  అది ‘బబుల్‌‌’ అని రాజన్ పేర్కొన్నారు. చాలా క్రిప్టోల వాల్యూ పెరగడానికి కారణం, వీటిని కొనడానికి బయట అతిపెద్ద మూర్ఖుడు ఉండడమేనని చెప్పారు. ‘చిట్‌‌ ఫండ్స్‌‌ వలన తలెత్తే సమస్యలనే క్రిప్టో కరెన్సీలు తీసుకొస్తాయి. జనం దగ్గర డబ్బులు తీసుకొని చిట్‌‌ ఫండ్స్ ఉడాయిస్తాయి. క్రిప్టో కరెన్సీలను హోల్డ్ చేస్తున్న చాలా మంది ఇన్వెస్టర్లు బాధపడతారు’ అని రాజన్ పేర్కొన్నారు. మెజార్టీ క్రిప్టోలకు శాశ్వతంగా ఒక విలువ అంటూ లేదని అన్నారు. కొన్ని క్రిప్టోలు పేమెంట్స్‌‌ కోసం కొనసాగగలవని, ముఖ్యంగా ఇతర దేశాలకు పంపడానికి  ఇవి కొనసాగే అవకాశం ఉందని అంచనా వేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై రాజన్ మాట్లాడారు. బ్లాక్ చెయిన్ టెక్నాలజీ  ఎదగడానికి అవకాశం ఇవ్వాలని అన్నారు. 

సినిమా టికెట్లకు క్రిప్టోల్లో చెల్లించొచ్చు..
సినిమా టికెట్లను కొనడానికి  క్రిప్టోల్లో చెల్లించొచ్చని యూఎస్‌‌లోని అతిపెద్ద మూవీ థియేటర్ చెయిన్ రెగల్‌‌ సినిమాస్‌‌  ప్రకటించింది. డిజిటల్ పేమెంట్స్ కంపెనీ ఫ్లెక్సతో కలిసి ఈ సేవలను అందిస్తోంది. బిట్‌‌కాయిన్, డోజ్‌‌కాయిన్‌‌, లైట్‌‌కాయిన్‌‌, ఎథరమ్‌ వంటి క్రిప్టోలను మూవీ టికెట్లు, శ్నాక్స్  కొనడానికి వాడొచ్చని రెగల్‌‌ ప్రకటించింది.  క్రిప్టో కాయిన్స్‌‌తో పాటు  బేసిక్ అటెన్షన్‌‌ టోకెన్ (బీఏటీ), లింక్‌‌, ఆటమ్‌‌ వంటి డిజిటల్ టోకెన్స్‌‌ను, యూఎస్‌‌డీ కాయిన్‌‌, డాయ్‌‌, జెమిని డాలర్ వంటి స్టేబుల్ కరెన్సీలను కూడా స్వీకరిస్తామని పేర్కొంది.

బిట్‌‌కాయిన్ కోసం ఏకంగా సిటీనే..
బిట్‌‌కాయిన్‌‌కు  లీగల్‌‌ కరెన్సీ హోదా ఇచ్చిన ఎల్‌‌సాల్వడర్‌‌, ఈ క్రిప్టో కోసం ఏకంగా ఓ సిటీని నిర్మించాలనుకుంటోంది. బాండ్లను ఇష్యూ చేయడం ద్వారా ఒక బిలియన్ డాలర్లను సేకరిస్తామని ఆ దేశ ప్రెసిడెంట్‌‌ నయిబ్‌‌ బకెల్‌‌ ప్రకటించారు. ఈ బిలియన్‌‌ డాలర్‌‌‌‌లో సగాన్ని మరిన్ని బిట్‌‌కాయిన్లు కొనడానికి వినియోగిస్తారు. మిగిలిన సగాన్ని బిట్‌‌కాయిన్ మైనింగ్‌‌ కోసం అవసరమైన ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ను డెవలప్ చేయడానికి వాడతారు.  బిట్‌‌కాయిన్‌‌ సిటీని కాన్చవు అగ్నిపర్వతం దగ్గర్లో నిర్మిస్తామని, బిట్‌‌కాయిన్ మైనింగ్‌‌కు అవసరమయ్యే కరెంట్‌‌ను ఈ అగ్నిపర్వతం నుంచి సేకరిస్తామని ఎల్‌‌సాల్వడర్ ప్రకటించింది. అంతేకాకుండా ఈ సిటీలో నివసించే వారిపై ఎటువంటి ట్యాక్స్‌‌లను వేయమని ఆ దేశ ప్రెసిడెంట్ చెప్పుకొచ్చారు. ఈ సిటీలో అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తామని, బిట్‌కాయిన్ ఆకారంలో ఈ సిటీని నిర్మిస్తామని  ఎల్‌సాల్వడర్ ప్రకటించింది.