రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ సర్వే కొనసాగుతోంది. ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారు. సర్వేలో ఆరోగ్య సిబ్బంది సహా మున్సిపల్, పంచాయతీ అధికారులు పాల్గొంటున్నారు . కరోనా లక్షణాలు ఉన్నవారికి హోం ఐసోలేషన్ కిట్లు ఇస్తున్నారు. వారి ఆరోగ్యాన్ని రోజూ మానిటర్ చేయనున్నారు. అవసరమైతే సమీప ప్రభుత్వ దవాఖానకు తరలిస్తున్నారు. రాష్ట్రంలో 2 కోట్ల టెస్టింగ్ కిట్లు, కోటి హోం ఐసోలేషన్ కిట్లు సిద్ధంగా ఉన్నాయంది ప్రభుత్వం. ప్రభుత్వ సూచనతో ఫీవర్ సర్వేలో స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బస్తీ దవాఖానల్లో టెస్టింగ్ కిట్లను ఇప్పటికే పంపిణీ చేసింది ఆరోగ్యశాఖ. ఒక్కో టీంలో ఆశా వర్కర్, పంచాయితీ సిబ్బంది ఉన్నారు. ఒక టీమ్ రోజుకు 60 ఇళ్లు కవర్ చేసేలా టార్గెట్ విధించారు. లక్షణాలున్న వారికి అందించే కిట్ లో పారాసిటమాల్, యాంటీ బయోటిక్స్, మల్టీ విటమిన్ మందులు ఇస్తున్నారు.
ఖైరాతాబాద్ లో జరిగిన ఫీవర్ సర్వే తీరును పరిశీలించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ . ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. వారం రోజుల్లో ఫీవర్ సర్వే కంప్లీట్ చేస్తామన్నారు . గ్రేటర్ పరిధిలో GHMC, హెల్త్ డిపార్ట్మెంట్ కలిసి సర్వే చేస్తున్నామని చెప్పారు. ప్రజలంతా ఫీవర్ సర్వేకి సహకరించాలన్నారు. లక్షణాలున్న వారికి మెడిసిన్ కిట్స్ అందజేస్తామని తెలిపారు. త్వరలోనే కరోనా కేసులు తగ్గుతాయన్నారు.