మెదక్, వెలుగు: ప్రభుత్వ భూమిని అడ్డదారిలో కొందరికి కట్టబెట్టేందుకు ప్రయత్నించిన కామారెడ్డి ఆర్డీవో(అప్పటి జిన్నారం తహసీల్దార్) నరేందర్ తో పాటు డిప్యూటీ తహసీల్దార్ కె. నారాయణ, ఖాజీపల్లి వీఆర్వో జే. వెంకటేశ్వర్రావును సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ మంగళవారం ఆర్డర్ జారీ చేశారు. మరో ఐదుగురు ఎంప్లాయిస్పై డిపార్ట్మెంటల్యాక్షన్ తీసుకోవాలని, భూమిని పొందేందుకు ప్రయత్నించిన వారిపై క్రిమినల్యాక్షన్ తీసుకోవాలని ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్కమిషనర్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. జిన్నారం తహసీల్దార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. 2013లో సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల తహసీల్దార్గా పనిచేసిన నరేందర్, డిప్యూటీ తహసీల్దార్ నారాయణ, ఖాజిపల్లి వీఆర్వో వెంకటేశ్వర్రావు కలిసి ఖాజీపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్181లో ఉన్న ప్రభుత్వ భూమిని స్వాతంత్ర సమరయోధుల కోటాలో ఎన్. నాగేంద్ర రావు, తోట వెంకటేశ్వర్లు, ఉప్పు రంగనాయకులు, ఎం.మధుసూదన్అనే నలుగురు వ్యక్తులకు ఒక్కొక్కరికి 5 ఎకరాల చొప్పున అసైన్మెంట్ కింద కేటాయించినట్టు నకిలీ పట్టాలు తయారు చేశారు.
అందుకనుగుణంగా రికార్డుల్లో వారి పేర్లు నమోదు చేశారు. కొన్నాళ్ల క్రితం నలుగురిలో ఒకరైన నాగేంద్రరావు నో అబ్జక్షన్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసిన సమయంలో సమర్పించిన డాక్యుమెంట్స్ను పరిశీలించిన రెవెన్యూ అధికారులు అవి సరైనవి కావని అనుమానించారు. ఈ మేరకు జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్తో ఎంక్వైరీ చేయించారు. ఆయన విచారణ జరిపి నలుగురు వ్యక్తులకు ప్రభుత్వ భూమిని అక్రమంగా కేటాయించినట్టు, రికార్డుల్లో దిద్దుబాట్లు చేసినట్టు తేల్చారు. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ సూచన మేరకు అప్పటి జిన్నారం తహసీల్దార్ నరేందర్, డిప్యూటీ తహసీల్దార్ కె.నారాయణ, ఖాజీపల్లి వీఆర్వో వెంకటేశ్వర్రావు మీద గత నెల 14న జిన్నారం తహసీల్దార్ ఐడీఏ బొల్లారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 17న కేసు(ఎఫ్ఐఆర్ నం.115/2020) నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కామారెడ్డి ఆర్డీవోగా పనిచేస్తున్న నరేందర్ ముందస్తు బెయిల్ కోసం మెదక్ 8వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మరో ఐదుగురిపై చర్యలు
ఖాజీపల్లి భూవ్యవహారంతో సంబంధం ఉన్న అప్పటి జిన్నారం మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్జి.విష్ణువర్ధన్, మండల సర్వేయర్ లింగారెడ్డి, తహసీల్దార్ ఆఫీస్ సీనియర్అసిస్టెంట్ ఆర్.ఎం.ఈశ్వరప్ప, సూపరింటెండెంట్సహదేవ్, 2019లో పనిచేసిన సంగారెడ్డి ఆర్డీవోల మీద డిపార్ట్మెంటల్యాక్షన్ తీసుకోవాలని ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ను చీఫ్ సెక్రటరీ సోమేష్కుమార్ ఆదేశించారు. స్వాతంత్ర సమర యోధుల కోటాలో భూమి పొందేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తుల మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.