కామారెడ్డి ఆర్డీవో మరో ఇద్దరు సస్పెన్షన్

కామారెడ్డి ఆర్డీవో మరో ఇద్దరు సస్పెన్షన్

మెదక్, వెలుగు: ప్రభుత్వ భూమిని అడ్డదారిలో కొందరికి కట్టబెట్టేందుకు ప్రయత్నించిన కామారెడ్డి ఆర్డీవో(అప్పటి జిన్నారం తహసీల్దార్​) నరేందర్ తో పాటు డిప్యూటీ తహసీల్దార్​ కె. నారాయణ, ఖాజీపల్లి వీఆర్వో జే. వెంకటేశ్వర్​రావును సస్పెండ్​ చేస్తూ ప్రభుత్వ చీఫ్​ సెక్రటరీ సోమేష్​ కుమార్​ మంగళవారం ఆర్డర్​ జారీ చేశారు. మరో ఐదుగురు ఎంప్లాయిస్​పై డిపార్ట్​మెంటల్​యాక్షన్ ​తీసుకోవాలని, భూమిని పొందేందుకు ప్రయత్నించిన వారిపై క్రిమినల్​యాక్షన్​ తీసుకోవాలని ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్​ చీఫ్​కమిషనర్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్​ను ఆదేశించారు. జిన్నారం తహసీల్దార్​ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. 2013లో సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల తహసీల్దార్​గా పనిచేసిన నరేందర్, డిప్యూటీ తహసీల్దార్ నారాయణ, ఖాజిపల్లి వీఆర్వో వెంకటేశ్వర్​రావు కలిసి ఖాజీపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్​181లో ఉన్న ప్రభుత్వ భూమిని స్వాతంత్ర సమరయోధుల కోటాలో ఎన్. నాగేంద్ర రావు, తోట వెంకటేశ్వర్లు, ఉప్పు రంగనాయకులు, ఎం.మధుసూదన్​అనే నలుగురు వ్యక్తులకు ఒక్కొక్కరికి 5 ఎకరాల చొప్పున అసైన్​మెంట్​ కింద కేటాయించినట్టు నకిలీ పట్టాలు తయారు చేశారు.

అందుకనుగుణంగా  రికార్డుల్లో వారి పేర్లు నమోదు చేశారు. కొన్నాళ్ల క్రితం నలుగురిలో ఒకరైన నాగేంద్రరావు నో అబ్జక్షన్​ సర్టిఫికెట్  కోసం దరఖాస్తు చేసిన సమయంలో సమర్పించిన డాక్యుమెంట్స్​ను పరిశీలించిన రెవెన్యూ అధికారులు అవి సరైనవి కావని అనుమానించారు. ఈ మేరకు జిల్లా మైనార్టీ వెల్ఫేర్​ ఆఫీసర్​తో ఎంక్వైరీ చేయించారు. ఆయన విచారణ జరిపి నలుగురు వ్యక్తులకు ప్రభుత్వ భూమిని అక్రమంగా కేటాయించినట్టు, రికార్డుల్లో దిద్దుబాట్లు చేసినట్టు తేల్చారు. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్​ సూచన మేరకు అప్పటి జిన్నారం తహసీల్దార్​ నరేందర్, డిప్యూటీ తహసీల్దార్​ కె.నారాయణ, ఖాజీపల్లి వీఆర్వో వెంకటేశ్వర్​రావు మీద గత నెల 14న జిన్నారం తహసీల్దార్​ ఐడీఏ బొల్లారం పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. 17న కేసు(ఎఫ్ఐఆర్ నం.115/2020) నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కామారెడ్డి ఆర్డీవోగా పనిచేస్తున్న  నరేందర్​  ముందస్తు బెయిల్​ కోసం మెదక్​ 8వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు.

మరో ఐదుగురిపై చర్యలు

ఖాజీపల్లి  భూవ్యవహారంతో సంబంధం ఉన్న అప్పటి జిన్నారం మండల రెవెన్యూ ఇన్స్​పెక్టర్​జి.విష్ణువర్ధన్​, మండల సర్వేయర్​ లింగారెడ్డి, తహసీల్దార్​ ఆఫీస్​ సీనియర్​అసిస్టెంట్​ ఆర్.ఎం.ఈశ్వరప్ప, సూపరింటెండెంట్​సహదేవ్​, 2019లో పనిచేసిన సంగారెడ్డి ఆర్డీవోల మీద డిపార్ట్​మెంటల్​యాక్షన్​ తీసుకోవాలని ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్​ చీఫ్​ కమిషనర్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్​ను చీఫ్​ సెక్రటరీ సోమేష్​కుమార్​ ఆదేశించారు. స్వాతంత్ర సమర యోధుల కోటాలో భూమి పొందేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తుల మీద క్రిమినల్​ యాక్షన్​ తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.