- ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 1,644 మంది ఇన్స్ట్రక్టర్ల భర్తీ
హైదరాబాద్, వెలుగు: సర్కారు బడి పిల్లలకు కంప్యూటర్ చదువులు మరింత సులభం కానున్నాయి. ఇందులోభాగంగా రాష్ట్రవ్యాప్తంగా 1,644 మంది ఇన్స్ట్రక్టర్ల (ఐసీటీ ఇన్స్ట్రక్టర్లు)ను నియమించాలని నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,288 బడుల్లో ఐసీటీ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో 1,700 సమగ్ర శిక్ష స్కూళ్లు ఉండగా, 1,588 పీఎంశ్రీ స్కూళ్లు ఉన్నాయి. పీఎంశ్రీ కింద సరిపడా స్కూళ్లు లేకపోవడంతో మరో 794 సమగ్ర శిక్ష బడులను వీటికి అటాచ్ చేశారు.
ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఈ నియామకాలు జరుగుతాయి. ఈ నియామకాల్లో ఒక్కో ఐసీటీ ఇన్స్ట్రక్టర్కు రెండు స్కూళ్ల బాధ్యతలు అప్పగిస్తారు. సమగ్ర శిక్ష స్కూళ్లలో 1,700 బడులకు గాను 850 మంది ఇన్స్ట్రక్టర్లు.. పీఎంశ్రీ స్కూళ్లలో 1,588 బడులకు గాను 794 మంది ఇన్స్ట్రక్టర్లు పని చేస్తారు. మొత్తం 1,644 మంది ఇన్స్ట్రక్టర్లు 3,288 స్కూళ్లను కవర్ చేస్తారని అధికారులు వెల్లడించారు. స్కూళ్ల మ్యాపింగ్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని డీఈఓలను నవీన్ నికోలస్ ఆదేశించారు.
